
గుంటూరు:-గత రెండు దశాబ్దాలుగా దళితుల హక్కులు, సామాజిక న్యాయం కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్న న్యాయవాది దోవా రమేష్ రాంజీకి ప్రతిష్ఠాత్మక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశిష్ట సేవా రత్న అవార్డు లభించింది.
ఆదివారం గుంటూరులో నిర్వహించిన మాలల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో మాల మహాసభ జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకటరావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్, మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ చేతుల మీదగా ఈ అవార్డును ఘనంగా ప్రదానం చేశారు.
పాత రేపల్లె తాలూకా ప్రాంతంలో గత 20 సంవత్సరాలుగా రేపల్లె డివిజన్ దళిత అంబేద్కర్ యువజన సమాఖ్య అధ్యక్షులుగా, అలాగే మాల మహాసభ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గుర్తింపు పొందిన రమేష్ రాంజీ, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జైభీమ్ రావ్ భారత్ పార్టీ తరఫున రేపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేశారు.Guntur Local News
రాష్ట్ర వ్యాప్తంగా జాతి ఔన్నత్యం, దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న వ్యక్తులను గౌరవించే కార్యక్రమంలో భాగంగా రమేష్ రాంజీ సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీత దోవా రమేష్ రాంజీ మాట్లాడుతూ,
“అంబేద్కర్ పేరు మీద అవార్డు అందుకోవడం నాకు గర్వకారణం. ఇది సమాజ హితం పట్ల నా బాధ్యతను మరింత పెంచింది. జీవితాంతం దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తాను” అని పేర్కొన్నారు.
ఈ అవార్డు లభించిన సందర్భంగా పలువురు న్యాయవాదులు, దళిత సంఘాల ప్రతినిధులు, మాల సంఘ నాయకులు రమేష్ రాంజీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.










