

కెనడా టొరంటోలో డర్హమ్ తెలుగు క్లబ్ ఘనంగా నిర్వహించిన ‘డి.టి.సి ఫ్యామిలీ ఫెస్ట్ 2025’
కెనడాలోని డర్హమ్ తెలుగు క్లబ్ (DTC) ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కాన్సెప్ట్తో “డి.టి.సి ఫ్యామిలీ ఫెస్ట్ 2025” వేడుకలు టొరంటో ఓషావాలోని మ్యాక్స్వెల్ హైట్స్ సెకండరీ స్కూల్ ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు 800కు పైగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నాయి.
కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా అపర్ణా రంభోట్ల, సంతోష్ కుంద్రు, యువ వ్యాఖ్యాతలుగా ఆశ్రిత పోన్నపల్లి, శిరి వంశికా చిలువేరు, శ్రేయస్ ఫణి పెండ్యాల వ్యవహరించారు. కార్యక్రమ ప్రారంభంలో డీటీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు—నరసింహారెడ్డి గుత్తిరెడ్డి, రవి మేకల, వెంకటేశ్వర్ చిలువేరు, రమేష్ ఉప్పలపాటి, శ్రీకాంత్ సింగి శెట్టి, గుణశేఖర్ కోనపల్లి, యుగంధర్ చెరుకురి, గౌతమ్ పిడపర్తి, వసుదేవకుమార్ మల్లుల, కమల్ మూర్తి, సర్దార్ ఖాన్ చెరుకు పాలెం, శివరామ్ మోహన్ పసుపులేటి—జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కెనడా జాతీయ గీతం, ‘మా తెలుగు తల్లి’ గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది.
తదుపరి సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు, యువత, కళాకారులు సంగీతం, నృత్యం, సంప్రదాయ కళారూపాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. డీటీసీ కుకింగ్ షో, డీటీసీ కిడ్స్ ఫ్యాషన్ షో ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణలు కాగా, విజేతలకు Advanced Physio గ్రాండ్ స్పాన్సర్ తూసి వినయగమూర్తి బహుమతులు అందజేశారు.
కల్చరల్ డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు మాట్లాడుతూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కెనడాలో కొనసాగించడంలో ఇటువంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. కెనడాలోని తెలుగు సమాజం చూపుతున్న ఐక్యత పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన డా. బాబీ యానగావా (MD, PhD, FRCSC), హెడ్ – కార్డియాక్ సర్జరీ, సెయింట్ మైకేల్స్ హాస్పిటల్, కుటుంబ ఆరోగ్యం, గుండె ఆరోగ్యంపై ముఖ్య సూచనలు అందించారు. అనంతరం డీటీసీ ఎక్సలెన్సీ అవార్డులను డా. బాబీ యానగావా, డా. శరత్ గుండల, డా. శ్రీవాణి గుండల అందజేశారు. కమ్యూనిటీ సర్వీస్ అవార్డు – ఉషా నడుఱి, ఆర్ట్స్ & క్లాసికల్ డాన్స్ అవార్డు – చిన్నారి శిరి వంశికా చిలువేరు, ఆర్ట్స్ & సింగింగ్ అవార్డు – చిన్నారి శ్రేయస్ ఫణి పెండ్యాల అందుకున్నారు.
కార్యక్రమ విజయానికి తోడ్పడిన స్పాన్సర్లలో గ్రాండ్ స్పాన్సర్గా తూసి వినయగమూర్తి, ఫుడ్ స్పాన్సర్స్గా సింప్లీ సౌత్ – ఓషావా (రామ్ & సస్య పెడ్డి), సిల్వర్ స్పాన్సర్స్—రామ్ జిన్నాల, గెట్ హోమ్ రియాల్టీ (రమేష్ గోలు, ఆనంద పెరిచెర్ల), రఘు జులూరి, భారత్ లా—సపోర్టింగ్ స్పాన్సర్స్గా Advanced Physio (గౌతమ్ పిడపర్తి), డా. శరత్ గుండల, డా. పద్మజరాణి కొంగరా, డా. సౌజన్య కసులా, దేశీ కార్ట్ గ్రోసరీస్ (రాజశేఖర్), సివమ్మ టిఫిన్స్, బండీ మేడు బజ్జి (శ్రవంతి), నమస్తే ఇండియా సూపర్ మార్కెట్ (యోగేశ్ జీ), షోబీ డెకోర్స్, పవన్ PK ఫోటోగ్రఫీ సహకరించారు.
టొరంటో పరిసర ప్రాంతాల తెలుగు సంఘాలు—డర్హమ్ తెలుగు అసోసియేషన్ (DTA) నుండి స్వాతి మీర్యాల, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ (OTF) నుండి ప్రవీణ్ నీలా, బర్చ్మాంట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ (BFC) నుండి జగపతి రాయల, సూర్య కొండేటి, టొరంటో తెలుగు కమ్యూనిటీ (TTC) నుండి విజయ్ కుమార్ కోట, క్లారింగ్టన్ హిందూ అసోసియేషన్ మరియు డర్హమ్ హైదరాబాదీ అసోసియేషన్ ప్రతినిధులు హాజరై డీటీసీ సేవలను అభినందించారు.
తెలుగు ఇంటి వంటలు, తిండి-తినుబండారాలు సింప్లీ సౌత్ – ఒషావా సౌజన్యంతో అందించగా, 20కు పైగా బహుమతులతో రాఫెల్ డ్రా నిర్వహించారు.
డీటీసీ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గుత్తిరెడ్డి మాట్లాడుతూ, “తెలుగు సంస్కృతిని ఎక్కడ ఉన్నా గౌరవంతో నిలబెట్టుకోవాలి. అదే స్పూర్తితో డీటీసీ ఫ్యామిలీ ఫెస్ట్ 2025 ఘనవిజయం సాధించింది” అని తెలిపారు.
కార్యక్రమం చివరగా డీటీసీ కల్చరల్ డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు, అన్ని కార్యకర్తలు, స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు.










