
Bapatla:కారంచేడు:-ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సారధ్యంలో కారంచేడు మండలం కేంద్రంలోని యార్లగడ్డ కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఏలూరి చారిటబుల్ ట్రస్ట్, గ్రీన్ స్పార్క్ ఫౌండేషన్, నోవా అగ్రిటెక్ సంయుక్త ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది.
కారంచేడు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రక్తపరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించిన అనంతరం సమగ్ర కంటి పరీక్షలు చేపట్టారు. మొత్తం 425 మంది శిబిరానికి హాజరుకాగా, 105 మందికి శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు సూచించారు.శిబిరానికి ముందు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి, ఏలూరి నాగేశ్వరరావు చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ తిరుమలశెట్టి శ్రీహరి, నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ హుస్సేన్, ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కృష్ణారావు మాట్లాడారు. గత 15 సంవత్సరాలుగా రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కంటి వైద్య సేవలను నిరంతరంగా అందిస్తున్నారని కొనియాడారు.
పేదలకు ఆరోగ్యం అత్యంత కీలకమని, ముఖ్యంగా కంటి సమస్యలు జీవితాన్ని అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉందని వక్తలు పేర్కొన్నారు. Bapatla Local News నియోజకవర్గంలో లక్ష మందికి కంటి చూపు కల్పించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే ఏలూరి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి నెలా నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
శిబిరాల్లో కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచిత కళ్లజోడులు, శస్త్రచికిత్స అవసరమైన రోగులకు మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేయడం ఎమ్మెల్యే ఏలూరి సేవాభావానికి నిదర్శనమని అన్నారు. ఖర్చుల భయంతో పేదలు వైద్యం వాయిదా వేసుకోవద్దన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.సామాజిక బాధ్యతగా చేపట్టిన ఈ సేవా కార్యక్రమాలు రాజకీయాలకతీతంగా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పోతిన ఉదయ్ భాస్కర్, సర్పంచ్ బాలిగా శివ పార్వతి శ్రీనివాస్, ఉప సర్పంచ్ యార్లగడ్డ రత్తయ్య చౌదరి, కొత్తగొర్ల శ్రీరాములు, కంభంపాటి నరేంద్ర, పోతిన నాగేశ్వరరావు, మైలా బ్రహ్మయ్య, దగ్గుబాటి చౌదరి, రాయనీడి హనుమంతరావు, రామకృష్ణ, శాంతయ్య, యార్లగడ్డ శ్రీనివాసరావు, పోతిన రాజేంద్ర ప్రసాద్, కోసరాజు సురేంద్ర, ఖాసీం, బంగారు బాబు, పూర్ణయ్య, బ్రహ్మాజీ, చంద్రశేఖర్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.







