AP NEWS: హజ్ యాత్రికులకు ప్రభుత్వ ఏర్పాట్లు – రెండవ విడతలో 906 మంది హజ్ కు
HAZ TOUR PROGRAME START
ఆంధ్రప్రదేశ్ నుండి హజ్ యాత్ర -2025 కు బయలుదేరే యాత్రికులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అత్యంత పగడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసి పర్యవేక్షిస్తున్నట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఎంబార్కేషన్ సెంటర్ నుంచి రెండవ విడతలో 906 మంది ఏపీ ప్రయాణికులు సోమ, మంగళవారాల్లో మూడు విమానాలలో హజ్ యాత్రకు జెడ్డాకు వెళ్తున్నారు. హైదరాబాదులోని లకడికపూల్ సెంటర్లో ఉన్న షా ఫంక్షన్ ప్లాజాలో ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమాన్ని మైనారిటీ మంత్రిత్వ శాఖ, హజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. రెండవ విడత యాత్రకు బయలుదేరి వెళ్లే యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, మైనారిటీ మంత్రిత్వ శాఖ సలహాదారుడు ఎంఏ షరీఫ్, హజ్ కమిటీ చైర్మన్ హసన్ భాష,హజ్ కమిటీ సభ్యులు, తదితరులు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ప్రస్తుత ఏడాది పవిత్ర హజ్ యాత్రకు మొత్తం 1630 మంది యాత్రికులు వెళ్లడం జరుగుతున్నదని అన్నారు. ఇందులో 1170 మంది హైదరాబాద్ ఎంబార్కెషన్ కేంద్రం నుంచి, 451 మంది బెంగళూరు ఎంబార్కెషన్ కేంద్రం నుంచి, మిగిలిన 9 మంది ఇతర ఎంబార్కెషన్ కేంద్రాల నుంచి బయలుదేరడం జరుగుతున్నదని వెల్లడించారు.ఈనెల 19,20 వ తేదీలు సోమ,మంగళ వారాలలో మూడు విమానాల్లో మొత్తం 818 మంది హజ్ యాత్రికులు హైదరాబాద్ ఎంబార్కెషన్ కేంద్రం నుండి హజ్ కు వెళ్తున్నట్లు తెలిపారు.మరో 88 మంది యాత్రికులు ఈనెల 27 వ తేదీ చివరి విమానంలో హజ్ యాత్రకు వెళ్తున్నట్లు తెలిపారు. విజయవాడ ఎంబార్కెషన్ నుంచి కేవలం 72 మంది యాత్రికులు మాత్రమే తమ ఆప్షన్ ఇవ్వడం కారణంగా, సాంకేతిక కారణాల వలన, భారత విమానయాన శాఖ ద్వారా స్పెషల్ చార్టర్ ఫ్లైట్ వసతి కల్పించలేని పరిస్థితితులలో, హజ్ కమిటీ ఆఫ్ ఇండియా, ముంబై ఆ 72 మంది యాత్రికులను హైదరాబాద్ ఎంబార్కెషన్ నుండి బయలుదేరుటకు అనుమతించడం జరిగిందని పేర్కొన్నారు. గత నెలలో మొదటి విడతలో హజ్ యాత్రకు ఏపీ నుంచి 724 మంది యాత్రికులు హైదరాబాద్, బెంగళూరు ఎంబార్కెషన్ కేంద్రాల నుండి పవిత్ర మక్కా, మదీనా పుణ్య క్షేత్రాలకు వెళ్లడం జరిగిందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సురక్షితంగా, క్షేమంగా వారంతా చేరడం జరిగిందని మిగిలిన యాత్రికులకు కూడా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఏపీ హజ్ యాత్రికులకు సంబందించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా ఏలాంటి లోటు పాట్లు లేకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందని మంత్రి ఫరూక్ వెల్లడించారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించడమైనదని, కర్ణాటక,తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు, ఆయా రాష్ట్రాల హజ్ కమిటీల తో, ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశాలు కూడా నిర్వహించి ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు.