
తమిళనాడు ప్రభుత్వం ధ్వని కాలుష్యాన్ని నివారించడానికి ఇటీవల తీసుకొచ్చిన ప్రత్యేక చట్టం మాదిరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వెంటనే ధ్వని కాలుష్యాన్ని నివారించేందుకు చట్టం రూపొందించి అమలు చేయాలని, మతాలకు అతీతంగా అన్ని ప్రార్థనా మందిరాలలో మైకులు 55 డిసిబుల్స్ కు మించకుండా వినియోగించాలని, డి జె సౌండ్స్ లను కూడా అతి తక్కువ స్థాయిలో వినియోగించాలని, శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి పచ్చదనాన్ని పెంపొందించాలని, వ్యక్తిగత వాహనాలను తగ్గిస్తూ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను పెంచాలని జనచైతన్య వేదిక నిర్వహించిన చర్చా గోష్టిలో వక్తలు అభిప్రాయపడ్డారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో ధ్వని కాలుష్యం నివారణపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ ఇ.యన్.టి. స్పెషలిస్ట్ సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పూర్వ ప్రిన్సిపాల్ డా|| పి.ఎస్.ఎన్. పూర్తి మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా|| గార్లపాటి నందకిషోర్ లు పాల్గొని ప్రసంగించారు. డా|| పి.ఎస్. ఎన్. మూర్తి ప్రసంగిస్తూ 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ధ్వని కాలుష్యంపై తెచ్చిన చట్టంలో తగిన మార్పులు చేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయాలని కోరారు. మహారాష్ట్రలో నగర కమిషనర్ చొరవ తీసుకుని ధూలే పట్టణంలో డీజె ల వినియోగాన్ని సంపూర్ణంగా నిషేధించి అమలు చేశారని, రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగం దృఢమైన సంకల్పంతో కృషిచేసి దేశమంతా దీనిని ఆదర్శంగా తీసుకుని ధ్వని కాలుష్య నివారణకు నడుం బిగించాలన్నారు. అమెరికాలో హారన్ కొట్టడాన్ని అవమానంగా భావిస్తారని, మనదేశంలో నిషిద్ధ ప్రదేశాలో సహితం హారన్ ఉపయోగించడం ఆనవాయితీగా మారిందన్నారు. దీపావళి, వినాయక చవితి వేడుకల అనంతరం వినికిడి సమస్యలతో వందలాది రోగులు, తమ వద్దకు వస్తున్నారని వివరించారు. విజయవాడ నగరంలోని ట్రాఫిక్ సిబ్బందిలో 30 శాతం పైగా వినికిడి సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా||గార్లపాటి నందకిషోర్ ప్రసంగిస్తూ ధ్వని తీవ్రతతో బిపి, ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి లాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, ధ్వని తీవ్రత మరీ ఎక్కువైతే కర్ణభేరి పగిలిపోయి శాశ్వతంగా వినికిడి లోపం ఏర్పడుతుందన్నారు. విద్యార్థులకు, ప్రజలకు శబ్దాల స్థాయిల గురించి సంపూర్ణంగా అవగాహన కలిగించి చైతన్య పరచాలని కోరారు. ఆ దిశగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పౌర సంస్థలతో కలిసి కృషి చేస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ప్రపంచంలో ఫిన్లాండ్, ఐస్ లాండ్, నార్వే, స్వీడన్ లాంటి దేశాలలో ధ్వని కాలుష్యం అతి తక్కువగా ఉంటుందని, ప్రజల చైతన్యమే ప్రధాన కారణమన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్వని కాలుష్యం 65 డిసిబుల్స దాటితే ఏర్పడుతుందని తెలిపిందని, మనదేశంలో వాహనాల రద్దీ, పండుగలు, పారిశ్రామిక వాడలు ధ్వని కాలుష్యాన్ని పెంచుతున్నాయన్నారు. ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం శబ్ద కాలుష్య నివారణకు తీసుకొచ్చిన చట్టం మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరారు. పారిశ్రామిక వాడల్లో 75 డేసిబుల్స్, వ్యాపార కోడళ్ళ లో 65 డేసిబుల్స్, నివాస ప్రాంతాల్లో 55 డేసిబుల్స్ , నిశ్శబ్ద జోన్లలో 50 డేసిబుల్స్ కి మించకుండా ఉండాలని పేర్కొంటూ తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని స్వాగతించారు. ప్రముఖ వైద్యులు, సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు డా|| సేవ కుమార్ ప్రసంగిస్తూ నేల శబ్ద తరంగాలను గ్రహిస్తుందని, నేడు నగరాల్లో మట్టి అనేది కనపడకుండా కాంక్రీట్ మాయమవడం వలన ధ్వని కాలుష్యం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ చర్చా వేదిక కార్యదర్శి అవధానుల హరి, హిందూ కళాశాల అధ్యాపకులు డా||దుర్గాప్రసాద్, ఏపి గేజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు ఏవి పటేల్, సామాజిక విశ్లేషకులు టి. ధనుంజయ రెడ్డి, విశ్రాంత తెలుగు అధ్యాపకులు సూరం నారాయణరెడ్డి, మానవత కోశాధికారి టి.వి సాయిరాం, చావా శివాజీ, రేట్ పేయర్స్ అసోసియేషన్ నేత వి. సదాశివరావు బీసీ మహాజనసభ కార్యదర్శి ఉగ్గం సాంబశివరావుతదితరులు పాల్గొని ప్రసంగించారు.








