
రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ని ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రి లోకేష్ ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర రాజధాని ఉన్న గుంటూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో కొత్త ఉత్సాహం, కొత్త విధానాలతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు. జిల్లా పోలీస్ అధికారులు ప్రజల ఫిర్యాదులను తక్షణం పరిష్కరించే విధంగా సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ప్రధానంగా మహిళల భద్రత, గంజాయి నిర్మూలన, అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.







