
పంట పొలాల్లో నీరు బయటకు పంపాలని జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. తుఫాను ప్రభావంతో వివిధ పంట పొలాల్లో పరిస్థితిని జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులు, నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. పంటలను ఎట్టి పరిస్థితుల్లోను కాపాడాలని ముఖ్యమంత్రి ఆదేశించి ఉన్నారని చెప్పారు. అందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటువంటి సమస్య భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం తగిన సూచనలు, సలహాలు అందించాలని కోరారు. జలవనరుల శాఖ వ్యవసాయ శాఖ సమన్వయంతో పనిచేసి పక్కాగా సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం మాట్లాడుతూ పెదనందిపాడు వద్ద నల్లమడ వాగుకు పరుచూరు, ఆలేరు వాగుల నుండి నీరు చేరి 42,335 క్యూసెక్కుల నీరు ప్రవహించిందని, తద్వారా పంట పొలాల్లో బాగా నీరు చేరిందన్నారు. కొమ్మూరు కాలువ గండి పడిందన్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా క్రింద 3746 హెక్టార్లలో పంట నీట మునిగిందన్నారు. ఇందులో కాకుమాను మండలంలో 1326 హెక్టార్లు, పెదకాకాని మండలంలో 460 హెక్టార్లు, పెదనందిపాడులో 363 హెక్టార్లు, మంగళగిరిలో 265 హెక్టార్లు, తాడేపల్లిలో 92 హెక్టార్లు, ప్రత్తిపాడులో 70 హెక్టార్లు, చేబ్రోలులో 7 హెక్టార్లు ఉన్నాయన్నారు. నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులు తమ ప్రాంతంలో పంటలు, కాలువల పరిస్థితిని వివరించారు. కాలువలకు చేపట్టాల్సిన పనుల వివరాలను తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి తదితరులు పాల్గొన్నారు.







