
గుంటూరులో నూతనంగా నిర్మాణం చేసే రోడ్లు డ్రైన్ నిర్మాణం అనంతరమే చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. గురువారం స్తంభాల గరువు, బ్రాడీపేట, అరండల్ పేటల్లోని పలు ప్రాంతాలను పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో డ్రైన్ లు ఏర్పాటు చేయకుండా రోడ్లు నిర్మాణం చేయడం వలన వర్షాలకు రోడ్లు నీరు నిలిచి మరమత్తులకు గురువుతున్నాయన్నారు. కనుక రోడ్లతో పాటు డ్రైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. డ్రైన్ల ఆక్రమణలపై పట్టణ ప్రణాళిక అధికారులు కఠినంగా ఉండాలని, ఎక్కడైనా ఆక్రమణలు గుర్తిస్తే సంబందిత ప్లానింగ్ కార్యదర్శి, టిపిబీఓపై చర్యలు తీసుకుంటామన్నారు. అరండల్ పేట ఒకటవ లైన్ లో డ్రైన్ ఓవర్ ఫ్లోపై ప్రజల నుండి అందిన ఫిర్యాదు మేరకు పరిశీలించి, తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. అనంతరం స్తంభాల గరువు మహా ప్రస్తానంని పరిశీలించి, జిఎంసి నుండి తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.పర్యటనలో ఈఈ వేణుగోపాల్, ఏ సిపి రెహ్మాన్, ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.







