
గుంటూరు నగరపాలక సంస్థకు బకాయిలు ఉన్న పన్నువసూళ్లకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, మొండి బకాయిదారుల ఇళ్లు, కమర్షియల్ సంస్థలకు ట్యాప్, డ్రైనేజి కనెక్షన్ లు తొలగించాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, అధికారులకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో రెవెన్యూ విభాగ సమీక్షా సమావేశం జరిగింది.ఈ సందర్భంగా కమిషనర్ తొలుత వార్డ్ సచివాలయాల వారీగా ఉన్న అసెస్మెంట్లు, బకాయిలు, రోజువారీ వసూళ్లు చేయాల్సిన లక్ష్యంపై సమీక్షించి, పన్ను వసూళ్లలో పురోగతి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, మాట్లాడుతూ, రోజువారీ నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా చేయాల్సిన పన్ను వసూళ్లలో జీరో శాతంతో ఉన్న అడ్మిన్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. అలాగే విభాగాదిపతులకు పన్ను వసూళ్ల పర్యవేక్షణ విధులు కేటాయించాలన్నారు. ఇప్పటికే రెండో అర్ధ సంవత్సరం వచ్చినప్పటికీ ఆస్తి, ఖాళీ స్థల, త్రాగునీటి, మీటర్ల చార్జీలు వసూళ్లలో అలసత్వం వీడకుంటే ఎలా అని ప్రశ్నించారు. బకాయిదారులకు పన్ను చెల్లింపుపై నోటీసులు ఇవ్వడం, స్పందించకుంటే ట్యాప్, డ్రైనేజి కనెక్షన్ లు డిస్ కనెక్షన్ చేయడం, రెడ్ నోటీసులు ఇచ్చి తదుపరి ఆస్తులు జప్తు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పన్ను వసూళ్లపై డిప్యూటీ కమిషనర్లు మరింతగా క్షేత్ర స్థాయిలో పాల్గొనాలని, అధిక మొత్తం బకాయిదారులను నేరుగా కలవాలని ఆదేశించారు. పన్ను వసూళ్ల రోజువారీ నివేదిక ప్రతి రోజు సాయంత్రం తమకి అందించాలని ఆదేశించారు.సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు రవికిరణ్ రెడ్డి, మదన్ గోపాల్, రెహ్మాన్, సాదిక్ భాష, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, అడ్మిన్ కార్యదర్శులు పాల్గొన్నారు.







