
అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు అధిక నిధులు కేటాయించడం పట్ల గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన అనంతరం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…ఏపీ బడ్జెట్ రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసే విధంగా రూపుదిద్దుకుందని, గత ప్రభుత్వం బీసీలను విస్మరించిందని, ప్రస్తుత ప్రభుత్వం అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో చూస్తోందని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు సమగ్ర అభివృద్ధి సాధించాలనే సంకల్పంతో బడ్జెట్ రూపొందించామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.రాష్ట్రానికి విభజనతో జరిగిన నష్టంతో పాటు గత ప్రభుత్వ పాలన వల్ల ఆర్థిక విధ్వంసం చోటుచేసుకుందని పేర్కొంటూ, ఆ పరిస్థితులను సరిదిద్దడానికి రెండేళ్ల సమయం సరిపోదని చెప్పారు. అయినప్పటికీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేశామని, స్వర్ణాంధ్ర విజన్-2047” లక్ష్యంతో 2025 బడ్జెట్ ప్రవేశపెట్టామని, 2024లో ప్రవేశపెట్టిన బడ్జెట్ గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దే దిశగా ఉండగా, ఈసారి భవిష్యత్ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. ఏపీ అభివృద్ధికి ఈ బడ్జెట్ దోహదపడుతుందని, “హెల్తీ-వెల్తీ-హ్యాపీ స్టేట్” లక్ష్యం సఫలీకృతమవుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం అత్యంత అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బడ్జెట్ స్వర్ణాంధ్రప్రదేశ్కు నాంది పలికే దిశగా రూపుదిద్దుకుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు.






