
ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద గుర్తించిన అన్ని గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకంపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఐదు వందలు, ఆపైన జనాభా కలిగిన షెడ్యూల్ కులాల గ్రామాలను ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఎంపిక చేయడం జరిగింది. జిల్లాలో 40 గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతో అనుసంధానం చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించుటకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో గ్రామానికి రూ. 20 లక్షలు చొప్పున నిధులు విడుదల చేస్తుంది. గ్రామాల్లో పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం , విద్యుత్, తాగు నీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించుటకు సంకల్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన ఆదర్శ గ్రామాల్లో ముందుగా కనీసం ఐదు గ్రామాల్లో శత శాతం మౌళిక వసతుల కల్పించాలన్నారు. ఇందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, విద్య, వైద్య శాఖలు, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీ అధికారులు పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. కొన్ని గ్రామాలు ఆదర్శవంతంగా తయారు కావడం వలన ఇతర గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుందని, వివిధ పథకాల క్రింద అనుసంధాన మార్గాలు సులభం అవుతయాని అన్నారు. గ్రామ కమిటీలు గ్రామాల్లో సర్వే నిర్వహించి అవసరాలను గుర్తించాలని ఆదేశించారు. తదనుగుణంగా గ్రామ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. గ్రామ కమిటీలు గుర్తించిన గ్రామ అవసరాలను జిల్లా స్థాయి కమిటీకి సమర్పించాలని వాటిని జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి ఆమోదముద్ర వేస్తుందన్నారు. గ్రామ కమిటీలు, సంబంధిత శాఖలు వెంటనే ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి యు.చెన్నయ్య,జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి. విజయ లక్ష్మి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.







