
డిమాండ్ ఉన్న పంటల సాగుకు అడుగులు పడాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారీయా పిలుపునిచ్చారు. “రైతన్నా! మీ కోసం” కార్యక్రమం జిల్లాలో బుధవారం నిర్వహించారు. ఇందులో భాగంగా మేడికొండూరు మండలం సిరిపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరించేలా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని చెప్పారు. అగ్రిటెక్, డిమాండ్ ఉన్న పంటల సాగు, మార్కెటింగ్ సౌకర్యం పెంపు, పకృతి సేధ్యం, భూసార పరీక్షలు, పంట ఉత్పత్తులకు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా అధిక ధర వచ్చేలా చేయడం వంటి అంశాలపై రైతాంగానికి అవగాహన కలిగించేలా కార్యక్రమం నిర్వహణ జరుగుతోందని వివరించారు. జిల్లాలో 1,06,329 మంది రైతుల ఖాతాల్లో రూ.70 కోట్లు జమ అయిందన్నారు. ఇందులో అన్నదాత సుఖీభవ కింద రూ. 53.16 కోట్లు, పి.ఎం. కిసాన్ కింద రూ.16.84 కోట్లు జమ చేయడం జరిగిందని వివరించారు. రైతులు ఎవరి మీద ఆధారపడకుండా సకాలంలో వ్యవసాయ పనులు చేసుకొనుటకు, పెట్టుబడులు పెట్టుటకు దోహదం చేస్తుందని చెప్పారు. వ్యవసాయం, ఉద్యాన, పశు సంవర్ధక, మత్స్యరంగాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తోందన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో రూ. 308 కోట్లు ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సగటున సంవత్సరానికి 15 శాతం వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగిందని తెలిపారు. సమర్ధమైన నీటి నిర్వహణతో అధిక దిగుబడులు సాధించవచ్చని సూచించారు. మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా అన్నదాతలు సాగు పద్ధతులు మార్చుకోవాలని, రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి వాటికి డిమాండ్ వచ్చిందన్నారు. చిరు ధాన్యాల సాగు మరింత పెరగాలని, ప్రకృతి వ్యవసాయం పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అగ్రి టెక్ ను ప్రోత్సహిస్తుస్తుందని చెప్పారు. ఎస్పీ, ఎస్టీ రైతులకు బిందు సేద్యం పై 100 శాతం సబ్సిడీని ప్రభుత్వం పునరుద్ధరించిందన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ – పి.యం. కిసాన్ పధకం కింద రెండు విడతలు విడుదల జరిగిందన్నారు. సాగు భూమి కలిగి ఉన్న భూ యజమాని రైతు కుటుంబాలకు, అటవీ భూమి సాగుదారు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 14 వేలు, పి.యం. కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు వెరసి రూ.20 వేలు చొప్పున సంవత్సరానికి ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులు పాల్గొని వ్యవసాయ, అనుబంధ శాఖల పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని కోరారు. రైతు సమస్యలను పరిష్కరించడానికి వారానికి రెండు రోజులు, రోజుకు రెండు గ్రామాల చొప్పున ఖరీఫ్ 4 నెలలు, రబీలో 4 నెలలు నిర్వహిస్తున్నామని అన్నారు. రైతులకు పనిముట్లు పంపిణీ, కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన కస్టమ్ హైరింగ్ కేంద్రాలు ఏర్పాటు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కిసాన్ డ్రోన్ లతో కూడిన గ్రామ స్థాయి వ్యవసాయ యంత్రాల బ్యాంకులను ఏర్పాటు చేయడం జరుగుతుందని వాటిని వినియోగించుకోవాలని కోరారు. ఖరీఫ్ లో 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయుటకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని చెప్పారు. కొనుగోలు చేసిన 48 గంటలోనే చెల్లింపులు జరుపుటకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.తాడికొండ శాసన సభ్యులు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.







