
బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా సమగ్ర శిశు అభివృద్ధి సేవలు (ఐసీడీఎస్) అధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి బాలల దినోత్సవం వేడుకలలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తో కలిసి పాల్గొన్నారు. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ బాలల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం సర్వేవల్, పార్టిసిపెంట్, డెవలప్మెంట్, ప్రొటెక్షన్ హక్కులను కల్పించినది అని తెలిపారు. దీనిలో భాగంగా ఐసిడిఎస్ ద్వారా మూడు నుంచి 6 సంవత్సరాలు బాలల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం, విద్యను, విద్యాశాఖ ద్వారా ఆరు నుంచి 14 సంవత్సరాల లోపు బాలలకు నిర్బంధ ఉచిత విద్యను, వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రీయ స్వస్థత మిషన్ ద్వారా పసిపిల్లల నుంచి, పాఠశాలలో చదువుతున్న బాలలకు నిరంతరం వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, అనారోగ్యంతో ఉన్నవారికి ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం బాల కార్మిక వ్యతిరేక చట్టాలు, బాల్య వివాహాల నిరోధక తదితర రక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయడం జరుగుతుందని వివరించారు. బాలల హక్కుల పై విస్తృత అవగాహన కోసం ఈ సంవత్సరం బాలల దినోత్సవంను “ప్రతి చిన్నారికి, ప్రతి హక్కు.” (For Every Child, Every Right) అనే నినాదం జరుపుకుంటున్నామన్నారు.బాలికలు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడే సమాజంలో బాల్య వివాహాలను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యం అవుతుందన్నారు. బాల్య వివాహాలపై సమాచారం ఉంటే 1098 కి కాల్ చేసి చెబితే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలు తీసుకుంటురని చెప్పారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో కృషి చేసిన మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నామన్నారు. ఆయన స్ఫూర్తితో బాలలు సమాజానికి సేవ చేసేలా ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేలా కృషి చేయాలన్నారు . మూడవ తరగతి నుంచే ఐఏఎస్ అవ్వాలని లక్ష్యం నిర్దేశించుకోవటం ద్వారానే ఐఏఎస్ సాధించడం జరిగిందని తన చిన్ననాటి సంగతులను జిల్లా కలెక్టర్ విద్యార్థులతో పంచుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని బాలలు భవిష్యత్తులో ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ ప్రమీల మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నేటి బాలలు పై ఉందన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తుంది అన్నారు. బాలల హక్కులపై, చట్టబద్ధమైన దత్తతపై అవగాహన కోసం రూపొందించిన ప్రచార పోస్టర్లు కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తో కలిసి ఆవిష్కరించారు. అంతర్జాతీయ యోగా అథ్లేట్ డి ధీరజ్ శ్రీకృష్ణను, కిక్ బాక్సింగ్ లో పథకాలు సాధించిన బాలికలను సన్మానించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి సాధికారిత అధికారి పీపీజీ ప్రసున, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రి, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ టి శ్రీవాణి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సిహెచ్ విజయ్ కుమార్, దుర్గా, విద్యార్థిని దేవ కృప, సిడిపిఓలు, సూపర్వైజర్లు, మహిళా పోలీసులు, చైల్డ్ కేర్ ఇనిస్ట్యూషన్స్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.







