
వంద రోజుల ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సలీం బాషా అన్నారు. గుంటూరు గ్రామీణ మండలం లాల్పురం, పుట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, పుట్టూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాలలలో 10వ తరగతి వంద రోజుల కార్యాచరణ ప్రణాళికపై ప్రత్యేకంగా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. సబ్జెక్టుల వారీగా సమీక్షించారు. ఉపాధ్యాయులు అందరూ ప్రత్యేక శ్రద్ధతో వంద రోజుల ప్రణాళిక అమలు చేసి పది ఫలితాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. సబ్జెక్ట్ టీచర్స్ ప్రతి విద్యార్థిలో ఉన్న బలలు, బలహీనతలు గమనించి అందుకు తగిన విధంగా తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా ఇంగ్లీష్, లెక్కలలో విద్యార్థులలో ఉన్న భయాన్ని పోగొట్టాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులకు పదవ తరగతి అత్యంత కీలక దశ అని, ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలన్నారు. *గణిత ఉపాధ్యాయునికి అభినందన*లాల్పురం జిల్లా పరిషత్ హై స్కూల్ లో గణిత బోధన చేస్తున్న ఉపాధ్యాయుడులూర్దయ్యకు జిల్లా విద్యా శాఖ అధికారి ప్రత్యేకంగా అభినందించారు. గణిత ఉపాధ్యాయుడు 10వ తరగతి గణిత అభ్యాసాలకు సంబంధించిన సామర్థ్యాలను ప్రతి అధ్యాయానికి అనుగుణంగా డిస్ప్లే చార్ట్స్ రూపంలో రూపొందించడం, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా గణితాన్ని బోధించడం అద్భుతంగా ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశంసించారు. గణిత ఉపాధ్యాయుని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యా శాఖ అధికారి అబ్దుల్ ఖుద్దూస్, సి.ఆర్.పి శ్రీమతి అంజి బాయి పాల్గొన్నారు.







