
తుఫాన్ అనంతరం ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితులను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా బుధవారం పరిశీలించారు. ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో పర్యటించారు. ప్రత్తిపాడు వద్ద కొండవీడు లోయ వాగు వద్ద నీటి ప్రవాహం పరిశీలించారు. ప్రత్తిపాడు గ్రామంలో కాలువల పూడికలు తీస్తున్న పనులు పరిశీలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు. పెదనందిపాడు మండలం వరగాని గ్రామం వద్ద నక్కలవాగును పరిశీలించి, నక్కలవాగు, మేకలవాగును ట్రాక్టర్ పై దాటుకుంటూ వరగాని, నందిపాడు నల్లవాగు వంతెన వద్దకు జిల్లా కలెక్టర్ చేరుకున్నారు. పెదనందిపాడులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు. అచ్చట పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి పంటల మునక, వాటి పరిస్థితుల్ని తెలుసుకున్నారు. ప్రత్తిపాడు వద్ద పత్తి, మిరప పంటలు బాగా దెబ్బతిన్నాయని రైతులు చెప్పారు. పత్తి పంట పూర్తిగా పాడయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. యూరియా లభ్యత తక్కువగా ఉందని తెలిపారు. వర్షాలు కారణంగా పంటలు రక్షించుకునేందుకు అవలంభించాల్సిన పంటల యాజమాన్య పద్ధతులను వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అయితా నాగేశ్వర రావు వివరించారు. జిల్లాలో ఐదు వేల క్వింటాళ్ల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. ఆర్ అండ్ బి రహదారి ఆనుకుని ఉన్న కాలువలు సంవత్సరాలుగా పూడికలు తీయకపోవడంతో ఎక్కువ వర్షాలు కురిసేటపుడు పొలాల్లో నీరు ఎక్కువై రహదారులు మీదకు వస్తుందని రైతులు తెలిపారు. నక్కలవాగు, మేకలవాగు పూడిక లోతుగా తీయాలని వారు కోరారు. వాగులు పొంగటం వలన రహదారులపై రాకపోకలు నిలిచిపోతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వరద ప్రభావంను పరిశీలించామన్నారు. నక్కలవాగు, మేకలవాగుల వలన పంట పొలాలు మునగడం జరిగిందన్నారు. నిబంధనల మేరకు రెండు రోజుల్లో పంట నష్ట అంచనాలు తయారు చేయడం జరుగుతుందన్నారు. తుఫాను అనంతర చర్యలు వేగవంతం చేశామని చెప్పారు. పారిశుధ్యం లోపం లేకుండా చూడాలని ఆదేశించామన్నారు. కాజ్ వేల వద్ద నిరంతర పర్యవేక్షణ జరగాలని అన్నారు. విద్యుత్ పునరుద్ధరణ జరుగుతోందని చెప్పారు. రహదారులపై 84 చెట్లు పడిపోమాయని, వాటిని తక్షణం తొలగించే ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని వివరించారు. వసతి గృహాలు, పాఠశాల భవనాలు వర్షానికి బాగా తడిసి ప్రమాదకరంగా ఉండవచ్చని, తడి గోడలు విద్యుత్ ప్రవాహానికి కారణం కావచ్చని, వాటిని జిల్లా విద్యా శాఖ అధికారి, సంక్షేమ శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించి సురక్షితంగా ఉన్నాయని నిర్ధారణ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. పునరావాస కేంద్రాలలో ఉన్నవారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. జిల్లాలో 153 పునరావాస కేంద్రాలలో తొమ్మిది వేల మంది ఉన్నారని, వారికి నిత్యావసర సరుకుల కిట్లు సిద్ధం చేస్తున్నామని అన్నారు. పునరావాస కేంద్రాలలో ఉన్నవారికి ఒక వ్యక్తికి వెయ్యి రూపాయలు చొప్పున నగదు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. అయితే ఒక కుటుంబం నుండి ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది ఉన్నప్పటికీ గరిష్ఠంగా మూడు వేలు మాత్రమే చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు,, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అయితా నాగేశ్వర రావు, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.







