
మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలతో అందించే ఆర్థిక సహాయంతో స్వయం ఉపాధి పథకాలను ఏర్పాటు చేసుకొని జీవనోపాదులను మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా సూచించారు. బుధవారం ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామంలోని కొండవీటి బజార్ లో స్వయం సహాయక సంఘాల సభ్యులు బ్యాంకు లింకేజీ రుణంతో ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపార దుకాణాలను పరిశీలించారు. వ్యాపార నిర్వహణ వల్ల పొందుతున్న ఆదాయ వివరాలను, జీవనోపాదుల మెరుగుదల అంశాలను దుకాణాల నిర్వాహకులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. అమీనాబాద్ గ్రామ సచివాలయంలో జరిగిన స్వయం సహాయక సంఘాల సభ్యుల గ్రామ సమైఖ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారిక లక్ష్యంగా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు స్వయం ఉపాధి కోసం అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. వీటిని మహిళలు సక్రమంగా సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా అందించే ఆర్థిక సహాయాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు వారి పిల్లలను ఉన్నత చదువులు చదివించటం మంచి పరిణామం అని అబినందించారు. ఆడపిల్లలకు బాల్యవివాహాలు చేయకుండా వారు స్వతంత్రంగా జీవించేలా విద్యతోపాటు, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. స్వయం సహాయక సంఘ సభ్యులు ఈ విషయాలను వారి కుటుంబాలతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. మహిళలు స్వయం సమృద్ధి అయితే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని తద్వారా, సమాజం, గ్రామాలు, మండలాలు, జిల్లా, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలకు అపారమైన శక్తి ఉందని, ప్రభుత్వం అందిస్తున్న సహకారాలు సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించి స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. డిఆర్డిఏ పీడీ విజయలక్ష్మి మాట్లాడుతూ ఫిరంగిపురం మండలంలోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళా రైతులకు మునగ సాగుకు ఉపాధి హామీ పథకం ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. మునగాకు పొడిని తయారు చేసే మిషనరీని సెర్ప్ ఆర్థిక సహాయంతో మహిళా ఎఫ్ పీ ఓ కు మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా మునగ సాగు చేసే రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. తొలుత జిల్లా కలెక్టర్ అమీనాబాద్ గ్రామంలో ఇటీవల తుఫానుకు నష్టం జరిగిన పత్తి పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడి నష్టాలు వివరాలను తెలుసుకున్నారు. అమీనాబాద్ నుంచి కొండవీటి ఘాట్ రోడ్డు వరకు నిర్మిస్తున్న ఆర్ అండ్ బి రహదారిని పరిశీలించారు. రహదారి నిర్మాణానికి పెండింగ్ లో ఉన్న భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని రెవిన్యూ అధికారులకు సూచించారు. వేమవరం గ్రామం వద్ద ఉన్న ఎన్ ఎస్ బ్రాంచ్ కెనాల్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఫిరంగిపురం, అమీనా బాద్ లో రైతులు పొలాల మధ్య రహదారిని అభివృద్ధి చేయాలని, పలువురు గ్రామస్తులు సామాజిక భద్రతా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇంటి స్థలాలు సమస్యలపై అందించిన అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధి శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డ్వామా పీడీ శంకర్, జిల్లా పంచాయతీ అధికారి సాయికుమార్, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ఈ కళ్యాణ్ చక్రవర్తి, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటరత్నం, ఆర్డీవో శ్రీనివాసులు, తహసిల్దార్ ప్రసాదరావు, ఎంపీడీవో శివ సుబ్రహ్మణ్యం, పంచాయతీ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.







