GUNTUR NEWS: అప్పుల భారాన్ని పెంచే బడ్జెట్- ముప్పాళ్ళ నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
ROUND TABLE DISCUSSION ON AP BUDGET
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అప్పుల భారాన్ని ప్రజలపై మరింత మోపే విధంగా ఉందని నేటి ఆర్థిక స్థితిని ప్రతిబింబించే విధంగా ఉందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు పేర్కొన్నారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో రాష్ట్ర బడ్జెట్ పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత వహించారు. ముప్పాళ్ళ నాగేశ్వరరావు ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా 2000 వ సంవత్సరం వరకు 56 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తే, నేడు భాజాపా పాలనలో 200 లక్షల కోట్లకు రుణ భారం పెరిగిందని, ఆంధ్రప్రదేశ్ లో కూడా 2023 – 24 నాటికి 10 లక్షల కోట్ల అప్పులు ఉంటే నేడు కూటమి ప్రభుత్వం 9 నెలల్లోనే మరో లక్ష కోట్ల అప్పు చేసిందని, 2025 – 26 బడ్జెట్ లో మరో లక్ష కోట్లకు పైగా అప్పులు చేయడానికి సిద్ధమైందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రానికి చేరుతున్న ప్రయోజనం శూన్యమని, కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం హామీలను అమలు చేయకుండా రాజధాని నిర్మాణానికి గ్రాంటులు ఇవ్వకుండా అప్పులు ఇప్పిస్తూ రుణ భారాన్ని పెంచుతుందన్నారు. మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షేక్ మస్తాన్ వలి ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ప్రకటించిన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి మహిళకు ప్రతినెల ఇస్తానన్న 1500 రూపాయలు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, డ్వాక్రా మహిళలను వడ్డీ రహిత రుణాలకు నేటి బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు జరగలేదన్నారు. రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే శక్తి గల పోలవరం జాతీయ ప్రాజెక్టును బ్యారేజ్ గా మార్చారని, బడ్జెట్ లో 6000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పోలవరానికి కేటాయించే బదులు కేంద్ర ప్రభుత్వం నుOడే గ్రాంట్ రూపంలో కూటమి ప్రభుత్వం రాబట్టాలన్నారు. బడ్జెట్ పుస్తకం రియల్ ఎస్టేట్ బ్రోచర్ గా రంగులతో మెరుస్తుందని, ప్రజల జీవితాలలో మంచి మార్పుకు దోహద పడేలా లేదన్నారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ధరల స్థిరీకరణ నిధి కోసం కేవలం 300 కోట్లు కేటాయించడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర పొందలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రతి నెలా 5000 కోట్ల రూపాయలు అప్పులు తీర్చడానికి బడ్జెట్ లో కేటాయింపులు ఉంటే, మరోవైపు మరో లక్ష కోట్లు అప్పు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడటం మంచిది కాదన్నారు. గతంలో నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్ లలో 10నుండీ 15 శాతం కేటాయిస్తే నేడు కేవలం 3.5 శాతం మాత్రమే కేటాయించడం దురదృష్టకరమన్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో వెనుకబడిన ప్రాంతాలకు నీరు అందించే వెలుగొండ ప్రాజెక్టుకు కేవలం 359 కోట్లు కేటాయించి రైతాంగాన్ని నిరాశ పరిచారన్నారు. బడ్జెట్ లో కేటాయింపులకు ఆచరణలో వాస్తవిక వ్యయానికి సంబంధం ఉండటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నేస్తం సహ వ్యవస్థాపకులు టీ. ధనుంజయ రెడ్డి, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణరెడ్డి, రాజ్యాంగ చర్చావేదిక కన్వీనర్ అవధానుల హరి, ప్రోగ్రెసివ్ ఫోరం అధ్యక్షులు మురళీకృష్ణ తదితరులు ప్రసంగించారు.