GUNTUR NEWS: ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సిఆర్డిఏ అనుమతి – పెమ్మసాని చొరవతో రూ. 48 కోట్ల నిధులను మంజూరు చేసిన సిఆర్డిఏ
పెమ్మసాని చొరవ ఫలితంగా గుంటూరు నగరాభివృద్ధికి మరో 48 కోట్లు వచ్చి చేరాయి. ఎన్నికల హామీలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఆయన ఇచ్చిన హామీ నెరవేరబోతోంది. ఆ దిశగా అడుగులు వేసిన గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్గాచొరవ కారణంగా ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ – 3 రహదారి నిర్మాణానికి గాను రూ 48 కోట్ల నిధులను మంజూరు చేస్తూ సిఆర్డిఏ అనుమతులను శుక్రవారం జారీ చేసింది. వివరాల్లోకి వెళితే పేరేచర్ల నుంచి పలనాడు వైపునకు ప్రయాణించేందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ – 3 రోడ్డు ప్రధాన రహదారిగా ఉపయోగపడుతుంది. పల్నాడు నుంచి వచ్చే వాహనాలు, భారీ వాహనాలు గుంటూరు బయటనుంచి ప్రయాణించే విధంగా ఈ రహదారి డిజైన్ చేయబడింది. 2014 – 19 సమయంలో టిడిపి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించగా, పనులన్నీ పూర్తి కాగా సుమారు ఒకటిన్నర కిలోమీటర్ రహదారి నిర్మాణం పెండింగ్ పడింది. 2019 ఎన్నికల తరువాత రహదారి నిర్మాణం పూర్తిగా చతికిల పడింది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత పెమ్మసాని గారు ఆ ప్రాజెక్టుపై తిరిగి దృష్టి పెట్టారు. కాగా పలుమార్లు ఇన్నర్ రింగ్ రోడ్డును అధికారులతో కలిసి పరిశీలించిన పిదప స్ట్రక్చరల్ నష్టపరిహారం చెల్లించాల్సిన పనులను, పెండింగ్లో ఉన్న రహదారి నిర్మాణ బాధ్యతను పెమ్మసాని గారు తీసుకున్నారు. నివాసితులకు, ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్న ఆయన, నష్టపరిహారం బాధ్యతను గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు గారికి అప్పగించారు. అనతి కాలంలోనే అక్కడ నివసించే వారికి రూ. 6.73 కోట్లు నష్టపరిహారాన్ని చెల్లించడంలో పెమ్మసాని గారి కృషి ఎంతైనా ఉంది. అనంతరం జిఎంసి నుంచి సిఆర్డిఏ కు వెళ్లిన ప్రతిపాదనల నిమిత్తం సి ఆర్ డి ఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి రూ 48 కోట్లను ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ – 3 పెండింగ్ రహదారి నిర్మాణానికి కేటాయిస్తూ అనుమతులను మంజూరు చేసింది. ఈ యావత్ ప్రక్రియకు సహకరించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రమంత్రి పి నారాయణ గారికి, సిఆర్డిఏ అధికారులకు, జిఎంసి అధికారులకు, నాయకులకు పెమ్మసాని గారు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.