GUNTUR NEWS: గుంటూరులో ప్రతి ప్రాంతానికి సమగ్రంగా త్రాగునీటిని అందించేందుకు ప్రత్యేక దృష్టి
DRINKING WATER MEETING IN CORPORATION
గుంటూరు నగరంలో ప్రతి ప్రాంతానికి సమగ్రంగా త్రాగునీటిని అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ 2.0లో భాగంగా సమగ్ర త్రాగునీటి పధకం అమలుకు రూపొందించిన డిపిఆర్ పై సలహాలు, సూచనలు కోసం నగరంలోని స్టేక్ హోల్డర్స్, సీనియర్ సిటిజన్స్, ప్రజా ప్రతినిధులతో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు నిర్వహించిన సమావేశంలో మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో 2014 నుండి 24/7 త్రాగునీరు అందిస్తామని జిఎంసి ప్రకటిస్తున్నా ఆచరణలో సాధ్యం కాలేదన్నారు. ఇప్పటకీ పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తుతుందని, రానున్న కాలంలో ప్రతి ప్రాంతానికి నీటిని పుష్కలంగా అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోరంట్ల కొండ మీద నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్ పనుల పురోగతిపై కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రతి వారం పురోగతిపై నివేదిక అడిగారన్నారు. కనుక జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు యుద్దప్రాతిపదికన గోరంట్ల ప్రాజెక్ట్ పూర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నగరంలోని రిజర్వాయర్లను ప్రతి నెల నిర్దేశిత సమయానికి తప్పనిసరిగా శుభ్రం చేయించాలని, అవసరమైన ప్రాంతాల్లో ఈఎల్ఎస్ఆర్ ల నిర్మాణ ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. కమిషనర్ మాట్లాడుతూ అమృత్ 2.0ని రానున్న 30 ఏళ్ల వరకు ప్రజలకు త్రాగునీటి అవసరాలను అంచనా వేసి అమృత్, యుఐడిఎఫ్ నిధుల ద్వారా షుమారు రూ.540 కోట్ల అంచనాలతో డిపిఆర్ రూపొందించామని, పనులను 2 ఏళ్ల కాల పరిమితితో పూర్తీ చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్ లు పూర్తయితే నగర ప్రజలకు త్రాగునీటి సమస్య ఎక్కడా తలెత్తే అవకాశం ఉండదన్నారు. డిపిఆర్ పై ప్రజా ప్రతినిధులు, స్టేక్ హోల్డర్స్, సీనియర్ సిటిజన్లు అందించే సూచనలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. తొలుత సిఆర్డీఏ మాజీ సిఈ ఆంజనేయులు పిపిటి ద్వారా డిపిఆర్ ని వివరించారు. అనంతరం కార్పొరేటర్లు, వివిధ సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, సూచనలు తెలిపారు.
సమావేశంలో ఎంఎల్సీ చంద్రగిరి ఏసురత్నం, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, ఎస్ఈ నాగ మల్లేశ్వరరావు, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ డి.శ్రీనివాస్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, రేట్ పెయర్స్ అసోసియేషన్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.