AP NEWS: దసరాలోగా చేనేత సహకార ఎన్నికలు – త్వరలో హెల్త్ ఇన్స్యూరెన్స్ అమలు
AP MINISTER SAVITA MEETING
దసరాలోగా చేనేత సహకార సంఘ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్లూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. చేనేతలకు త్వరలో హెల్త్ ఇన్స్యూరెన్స్ అమలు చేయనున్నామన్నారు. చేనేతల సంక్షేమానికి సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారని, చేనేత దుస్తుల అమ్మకాలు పెంచేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్ లో రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చిన నేతన్నలతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి మంత్రి సవిత బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె చేనేత రంగ అభివృద్ధికి సూచనలు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, చేనేతల అభివృద్ధికి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేస్తున్నామన్నారు. నూతన డిజైన్ల తయారీలో శిక్షణ ఇస్తున్నామన్నారు. తయారైన ఉత్పత్పులకు మార్కెట్ సౌకర్యం కల్పించేలా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మినీ కస్టర్లు, మెగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, నూతన టెక్స్ టైల్స్ పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం 92,724 మందికి రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నామన్నారు. దసరాలోగా సహకార సంఘ ఎన్నికలు. చేనేత సహకార సంఘాల బలోపేతానికి సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారని మంత్రి సవిత వెల్లడించారు. దీనిలో భాగంగా సహకార సంఘ ఎన్నికలు నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం సమాయత్తమవుతోందన్నారు. దసరాలోగా చేనేత సహకార సంఘ ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు. నూతన చేనేత సహకార సంఘాల ఏర్పాటుతో పాటు నిద్రావస్థలో ఉన్న సంఘాలను క్రీయాశీలకంగా పనిచేసేటట్లు చర్యలు తీసుకుంటున్నామన్నారు.