AP NEWS: కూటమి ప్రభుత్వంతో విద్యాభివృద్ధి – మంత్రి కందుల దుర్గేష్
MINISTER KANDULA DURGESH RELEASE DSC METIRIAL
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో విద్యారంగ అభివృద్ధి జరుగుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్ లో తన ఛాంబర్ లో మంత్రి కందుల దుర్గేష్ తన చేతుల మీదుగా ఎంతో మందిని టీచర్లుగా తీర్చిదిద్దిన “ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్” వారి డీఎస్సీ ట్రై మెథడ్స్ మెటీరియల్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అకాడమీ పాఠ్యపుస్తకాల ఆధారంగా, ప్రస్తుత సిలబస్ ప్రకారం గణితం, విజ్ఞాన, సాంఘిక శాస్త్రం ట్రై మెథడ్స్ మెటీరియల్ ను రూపొందించిన విషయ నిపుణులు బాలరాజును మంత్రి దుర్గేష్ అభినందించారు. దీంతో పాటు 1500కు పైగా బిట్స్ కలిగిన బుక్ లెట్ సైతం ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నఅభ్యర్థుల్లో స్వీయ లోపాలు సవరించుకునే ప్రాక్టీస్ బిట్స్ తో పాటు గత పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నాపత్రాలతో ఉన్న మెటీరియల్ అభ్యర్థులకు ఉపకరిస్తుందని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం 16 వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో ఎస్జీటీ అభ్యర్థులకు మేలు చేసేలా మెటీరియల్ రూపొందించారని ప్రశంసించారు. రాష్ట్ర విద్యార్థులకు రాయితీపై మెటీరియల్ అందించాలని, అదే విధంగా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న శిక్షణా తరగతుల్లో డీఎస్సీ అభ్యర్థులకు అవసరమైన మెలకువలు అందించాలని తెలిపారు. సమాజాభివృద్ధిలో విద్యారంగానిది కీలకపాత్ర అని మంత్రి దుర్గేష్ అన్నారు. కూటమి సర్కార్ తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో విద్యారంగానికి పునర్వైభవం వచ్చిందన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.