స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత
10.80 ఎకరాల్లో పార్కు ఏర్పాటు
365 రోజులూ నేతన్నలకు పని కల్పించడమే లక్ష్యం : మంత్రి సవిత….
మంగళగిరిలోని ఆటో నగర్ ను ఆనుకుని మెగా హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. చేనేత కార్మికులకు 365 రోజులు భృతి కల్పించే లక్ష్యంలో భాగంగా ఆ పార్కు ఏర్పాటుకు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బుధవారం మంగళగిరిలోని ఆటోనగర్ కు ఆనుకుని ఉన్న 10.80 ఎకరాలను చేనేత జౌళిశాఖ కమిషనర్ రేఖారాణితో కలిసి మంత్రి సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గడిచిన అయిదేళ్లు చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమూ అందకపోవడంతో పాటు ఉత్పత్తి అయిన వస్త్రాలు విక్రయించే మార్కెట్ సదుపాయం లభించకపోవడంతో, ఎందరో నేతన్నలు అప్పుల పాలయ్యారన్నారు. కొందరు చేనేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారని విచారం వ్యక్తంచేశారు. టీడీపీ పాలనలో చేనేతలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న సమయం చేనేతకు స్వర్ణయుగమన్నారు. 2014-19లో చేనేతల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. నూలు కొనుగోలుకు రాయితీ అందజేశారని, ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించారని మంత్రి గుర్తు చేశారు. వాటితో పాటు ముద్ర రుణాలతో పాటు త్రిఫ్ట్ పథకం అమలు చేశారన్నారు. ఆనాటి ప్రయోజనాలతో పాటు మరికొన్ని కొత్త పథకాలను నేతన్నలకు అందివ్వాలని సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ నిర్ణయించారని మంత్రి తెలిపారు.