
బాపట్ల:నవంబర్ 23:-పట్టణ ప్రజలు హ్యాపీ సండే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సంతోషాన్ని పంచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఐఏఎస్ పిలుపునిచ్చారు. బావ నారాయణస్వామి ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగిన హ్యాపీ సండే – సంతోషం సందడి కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.కలెక్టర్ మాట్లాడుతూ —రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా హ్యాపీ సండేకి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఇకపై ప్రతి ఆదివారం సాయంత్రం పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.

వివిధ పాఠశాలలకు చెందిన బాలబాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. రాబోయే ఆదివారం ప్రదర్శనల్లో పాల్గొనదలచిన కళాకారులు, విద్యార్థులు ముందుగానే మున్సిపల్ కమిషనర్ వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కళారూపాల ప్రదర్శనకు హ్యాపీ సండే మంచి వేదికగా నిలుస్తోందని, పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయడంతో పాటు రాష్ట్రస్థాయి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా కల్పించబడతాయని కలెక్టర్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, మున్సిపల్ సిబ్బంది, పలువురు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







