
ఏలూరు: ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని కుక్కునూరు మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇసుక ఉచితం కావడంతో, సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణలో ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు, దళారులు కుక్కునూరు, ఇబ్రహీంపేట మండలాల్లోని గోదావరి నది తీరం నుండి తెలంగాణకు ఇసుకను తరలించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దాచారం గ్రామం నుంచి ఇసుక రవాణా నిరాటంకంగా సాగుతోంది. స్థానిక అధికారుల అండదండలతోనే ఈ అక్రమ వ్యాపారం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించినా, కొన్ని రోజుల తర్వాత మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. విజిలెన్స్ హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ రాత్రిపూట లారీలతో ఇసుకను తరలిస్తున్నారు.

సోసైటీ పేరుతో సాగుతున్న ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, సొసైటీ సభ్యులకు తప్ప వేరే ఎవరికీ ఇసుక ర్యాంపులలోకి అనుమతి ఇవ్వకూడదని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కుక్కునూరు మారుమూల ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇక్కడ అభివృద్ధి పనులు చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇసుక అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న హెవీ లోడ్ టిప్పర్ల వల్ల స్థానిక రోడ్లు దెబ్బతింటున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి 28న ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి అక్రమ మట్టి తవ్వకాలు, ఇసుక రవాణాపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, కుక్కునూరులో ఆ ఆదేశాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందిELURU JILLA VAARATHALU.







