AP NEWS: కాలువల తవ్వకం పనులు మే నెలాఖరుకు పూర్తి చేయాలి – అవసరమైన చోట్ల 7రోజుల వ్యవధితో షార్ట్ టెండర్లు
MINISTER NIMMALA MEETING
రాష్ట్ర వ్యాప్తంగా కాలువల్లో పూడిక తీత, గుర్రపుడెక్క,తూటికాడ తొలగింపు,షట్టర్లు, గేట్ల మరమ్మత్తులు, గ్రీజు పెట్టడం వంటి నిర్వహణ పనుల కోసం ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ 344 కోట్ల రూపాయలు విడుదల చేశారని, ఈ పనులను స్వీయ పర్యవేక్షణ చేస్తూ, మే చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. సోమవారం విజయవాడలో జలవనరుల క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిఈలు, ఎస్ఈలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారాయన.ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్, కడా కమీషనర్ రాంసుందర్ రెడ్డి, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. గుర్రపుడెక్క, తూటికాడ వంటి వాటి తొలగింపుకోసం, మందుల పిచికారీకి డ్రోన్లు సైతం వినియోగించుకోవాలని సూచించారాయన. అవసరమైన చోట్ల 7 రోజుల వ్యవధితో షార్ట్ టెండర్లు పిలవడానికి అనుమతిచ్చిందని, నిర్వహణ మరియు మరమ్మత్తు పనులను చేపట్టడం యొక్క ప్రధాన లక్ష్యం, 2025 ఖరీఫ్ ప్రారంభానికి ముందు నీటిపారుదల వ్యవస్దలను సాధారణ స్దితికి తీసుకురావడం అని ఆయన అధికారులకు సూచించారు. గేట్లు, షట్టర్లు, వంటి మెకానికల్ పనులను తప్పనిసరిగా అసిస్టెంట్ ఇంజనీర్ పరిశీలించి, సక్రమంగా పనిచేసే స్దితిలో ఉన్నాయనే ధ్రువీకరణ పత్రాన్ని, చీఫ్ ఇంజనీర్ కు ఇవ్వాలని ఆదేశించారు. సాగు నీటి సంఘాలు ఆధ్వర్యంలో, వారి పరిధిలోని పనులను, మే నెలాఖరుకు పూర్తిచేయాలి.ఇలా పనులను సకాలంలో పూర్తిచేయడానికి చీఫ్ ఇంజనీర్లు, సూపరిండెంట్ ఇంజనీర్లు నిరంతరంగా పర్యవేక్షణ చేయాలన్నారు. ఎట్టి పరిస్దితుల్లోనూ అన్ని పనులూ, సీజన్ మొదలయ్యే నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించిన మంత్రి నిమ్మల రామానాయుడు, గతంలో మాదిరిగా కాకుండా మే చివరి నాటికి, అన్ని అత్యవసర పనులు, నాణ్యత తో పూర్తి చేయాలన్నారు.