
బాపట్ల, అక్టోబర్ 17 :జలజీవన్ మిషన్ కింద ఇంటింటికీ కొళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన తాగునీరు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లాలో మొత్తం 265 రెవెన్యూ గ్రామాలు ఉండగా, 3.64 లక్షల కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం 1.48 లక్షల గృహాలకు మాత్రమే కొళాయి కనెక్షన్లు ఉన్నాయని, మిగిలిన 2.15 లక్షల గృహాలకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. డిసెంబర్ 31 నాటికి 4,493 కనెక్షన్లు పూర్తి చేయాలని సూచించారు.జిల్లాలో 369 చిన్న చెరువులు, 25 మధ్యస్త చెరువులు, 5,083 చేతిపంపులు ఉన్నాయని వివరించారు. తాగునీటి ప్రాజెక్టుల సమర్థ నిర్వహణ, పర్యవేక్షణ కోసం జిల్లా, గ్రామ స్థాయిలో కమిటీలు పని చేస్తున్నాయని తెలిపారు. 2028 నాటికి ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల నీరు సరఫరా చేయడం లక్ష్యంగా జలజీవన్ మిషన్ పనులు కొనసాగుతున్నాయని అన్నారు.
జలజీవన్ మిషన్ కింద 64 పనులు ఇంకా ప్రారంభం కాలేదని, సంబంధిత ఏజెన్సీలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. రూ. 167.48 కోట్లతో మంజూరు చేసిన 403 పనులను గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న 277 పనులను ఆరు నెలల్లో పూర్తిచేయాలని తెలిపారు.జల వనరుల సంరక్షణలో భాగంగా పంటకుంటలు, నీటికుంటలు, ఇంకుడు గుంటలు విస్తృతంగా తవ్వాలని సూచించారు. చెరువులు, పైపులైన్ల మరమ్మతుల కోసం జిల్లా పరిషత్ నుండి రూ.9.94 కోట్లు కేటాయించాలంటూ డిప్యూటీ సీఈఓలను కోరారు.జిల్లాలో ప్రస్తుతం 40 శాతం మాత్రమే కొళాయి కనెక్షన్ల ద్వారా తాగునీరు అందుతున్నందున జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.పారిశుధ్య విభాగం విషయానికొస్తే, జిల్లాలో 406 సామాజిక మరుగుదొడ్లు మంజూరు కాగా, 223 పూర్తయ్యాయని, మిగిలినవి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా 18,288 గృహాలకు మరుగుదొడ్లు లేవని పేర్కొని, వాటికి యుద్ధప్రాధాన్యంతో మంజూరు చేయాలని సూచించారు.342 సామాజిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.10.26 కోట్లు, అలాగే 79 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి రూ.28.4 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. వాడిన నీటిని శుద్ధి చేసే ప్లాంట్ ఏర్పాటుకు మార్టూరు మండలం, మార్టూరు గ్రామాన్ని ఎంపిక చేసినట్లు వెల్లడించారు.ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు, అనుబంధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.







