
గుంటూరు: డిసెంబర్ 23 :-గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారానికి జనవరి 15 నాటికి ఈ–ఆఫీస్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, హౌసింగ్, ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగాలన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ డీలర్లు అధిక ధరలకు యూరియా విక్రయించకుండా మండల స్థాయి కమిటీలు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాల కోసం జనవరి 3 నుంచి 15 వరకు గుంటూరులో నిర్వహించనున్న ‘సరస్–2026’ ఎగ్జిబిషన్పై జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల గృహ ప్రవేశాలు లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను సాధించేలా గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎంపీడీవోలు, తహసీల్దార్లు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రణాళికను కఠినంగా అమలు చేయాలని, ఇందుకోసం పాఠశాలలకు నియమించిన నోడల్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. అలాగే ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు, సేవలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం మరింత మెరుగుపడేలా క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని తెలిపారు.ఆంధ్రప్రదేశ్
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేందుకు వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కే. ఖాజావలి, సీపీఓ శేషశ్రీ, హౌసింగ్ పీడీ ప్రసాద్, డ్వామా పీడీ శంకర్, జిల్లా పౌరసరఫరాల అధికారి కీర్తి, కోమలి పద్మ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.










