
వైఎస్ఆర్ కడప : పులివెందుల:15-10-2025:-పులివెందులలోని ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ & లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ (IGGAARL) ను బుధవారం నాడు జర్మన్ ఫెడరల్ ప్రభుత్వ అంబాసిడర్ డాక్టర్ ఫిలిప్ అకెర్మాన్ (Dr. Philipp Ackermann) సందర్శించారు. ఆయనతో పాటు బెంగుళూరు జర్మన్ కాన్సుల్ జనరల్ అమిత దేశాయ్, KfW బ్యాంకు నుంచి నాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ సంగీత అగర్వాల్ కూడా ఈ అకాడమీలో పర్యటించారు.అకాడమీలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నిర్వహిస్తున్న ప్రయోగాత్మక పనులను
అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న అధ్యయనాలు, వాటి ఫలితాలను వారు సమీక్షించారు. ఈ సందర్భంగా ఫార్మర్ సైంటిస్ట్ కోర్సు, మెంటార్ ప్రోగ్రామ్లలో పాల్గొంటున్న రైతు శాస్త్రవేత్తలు, యువ రీసెర్చ్ ఫెలోస్, ఇంటర్న్స్ తో అంబాసిడర్ ముచ్చటించారు.

అనంతరం, ప్రకృతి వ్యవసాయ చక్రం ఆధారంగా సాగు పద్ధతులు మరియు రైతు సాధికార సంస్థల ఉత్పత్తులతో ఏర్పాటైన ప్రదర్శన స్టాల్స్ ను సందర్శించారు. ముఖ్యంగా మిల్లెట్ ఆధారిత ఆహార పదార్థాలు మరియు వాటి ఉపయోగాల గురించి వివరించగా, అంబాసిడర్ డాక్టర్ ఫిలిప్ అకెర్మాన్ వాటిని ప్రశంసించారు.ఈ సందర్భంగా PowerPoint ప్రజెంటేషన్ ద్వారా IGGAARL అకాడమీ ద్వారా నడుపుతున్న ప్రాజెక్టులపై వివరణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, అకాడమీ ఏఓ శివారెడ్డి, వ్యవసాయశాఖ అధికారి చంద్ర నాయక్, ఎపిసిఎన్ఎఫ్ జిల్లా మేనేజర్ ప్రవీణ్ కుమార్, పులివెందుల ఆర్డీవో చిన్నయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.







