
విజయవాడ, మార్చి 31, 2026: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కేవలం ఐక్య పోరాటాల ద్వారానే సాధ్యమని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (IJU) అగ్ర నాయకులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలో మూడు రోజుల పాటు జరిగిన ఐజేయూ 11వ ప్లీనరీ సమావేశాల నిర్ణయాలను సోమవారం విజయవాడ ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. గత 19 ఏళ్లుగా జర్నలిస్టులకు వేతన సవరణ జరగకపోవడం శోచనీయమని, మజీథియా వేజ్ బోర్డు సిఫార్సుల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా రంగాన్ని విస్మరించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు కనీస నియమ నిబంధనలు, అపాయింట్మెంట్ లెటర్లు లేకపోవడం వారి వృత్తిగత భద్రతను ప్రశ్నార్థకం చేస్తోందని పేర్కొన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని రద్దు చేయడం మీడియా స్వేచ్ఛను అణచివేయడమేనని, తక్షణమే జర్నలిస్టుల రక్షణ కోసం ‘మీడియా ప్రొటెక్షన్ యాక్ట్’ తీసుకురావాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం తదుపరి ఉద్యమ కార్యాచరణను రూపొందించేందుకు ఏప్రిల్ నెలలో హైదరాబాద్లో అన్ని మీడియా సంఘాలతో భారీ సమావేశం నిర్వహించనున్నట్లు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇదే క్రమంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ డి.సోమ సుందర్ మాట్లాడుతూ.. మీడియా రంగంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ‘మీడియా కమిషన్’ ఏర్పాటు చేయాలని ప్లీనరీలో తీర్మానించినట్లు తెలిపారు. అలాగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ‘మీడియా కౌన్సిల్’గా మార్చి డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియాకు చోటు కల్పించాలని కోరారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి.సుబ్బారావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిలిపివేసిన జర్నలిస్టుల ప్రమాద బీమా, సంక్షేమ నిధిని పునరుద్ధరించాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మరియు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఐజేయూ మరియు ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు చావా రవి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.http://NTR DISTRICT NEWS







