
విశాఖపట్నం:- మద్దిలపాలెంలోని ఎంఆర్సీ కాకతీయ కన్వెన్షన్ హాల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర బడ్జెట్–2026పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలను విస్తృతంగా వివరించారు.

పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగాలు ఆంగ్లంలో ఉండటం, సమయ పరిమితుల కారణంగా రాష్ట్రాల అంశాలపై పూర్తి స్థాయిలో చర్చ జరగకపోతుందని పేర్కొన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వివరించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
2004–2014 మధ్య కాలంలో మౌలిక సదుపాయాల లోపం, దార్శనికత లేని పాలన దేశాన్ని వెనక్కి నెట్టిందని విమర్శించారు. గత 12 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం స్పష్టమైన లక్ష్యంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. గత బడ్జెట్ నుంచి ఈ బడ్జెట్ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం 365 సంస్కరణలను అమలు చేసిందని, వీటి వల్ల వ్యాపార రంగం, సామాన్య ప్రజలు లాభపడుతున్నారని చెప్పారు.
జీఎస్టీ సరళీకరణ ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరగడంతో పాటు చిన్న కార్ల ధరలు సుమారు రూ.80 వేల వరకు తగ్గాయన్నారు. ఆరోగ్య బీమా, జీవిత బీమా, విద్యపై జీఎస్టీని సున్నాకు తగ్గించడం వల్ల ప్రజలపై భారం తగ్గిందన్నారు. కొనుగోలు శక్తిని పెంచి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి పన్ను మినహాయింపు పరిమితిని రూ.12 లక్షలకు పెంచినట్లు తెలిపారు. 2018–19లో 5–6 శాతం ఉన్న నిరుద్యోగ రేటు ప్రస్తుతం 3 శాతానికి తగ్గినట్లు పేర్కొన్నారు.
రక్షణ రంగానికి భారీ కేటాయింపులు
రక్షణ బడ్జెట్ను గత ఏడాదితో పోలిస్తే 21 శాతం పెంచి రూ.2.2 లక్షల కోట్లకు చేర్చినట్లు తెలిపారు. రక్షణ రంగంలో 75 శాతం నిధులు స్వదేశీ పరికరాల కొనుగోలుకే వినియోగించాలనే నిబంధన వల్ల దేశీయంగా ఉద్యోగ అవకాశాలు, ఆవిష్కరణలు పెరుగుతున్నాయన్నారు. ఒకప్పుడు రూ.600 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు నేడు రూ.25 వేల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధి
హైవేల బడ్జెట్ను 10 శాతం పెంచామని, రైల్వే బడ్జెట్లోనూ 10 శాతం వృద్ధి ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఏడు హై–స్పీడ్ రైల్వే కారిడార్లు నిర్మాణంలో ఉండగా, వీటిలో ఆంధ్రప్రదేశ్కు కూడా లబ్ధి చేకూరనుందని చెప్పారు.
గ్రామీణాభివృద్ధి, ఉపాధి
గ్రామీణాభివృద్ధి బడ్జెట్ను 10 శాతం పెంచామని తెలిపారు. ఉపాధి హామీ పథకం స్థానంలో వీవీజీ రామ్ జీ పథకాన్ని ప్రవేశపెట్టి నిధులను రూ.85 వేల కోట్ల నుంచి రూ.95 వేల కోట్లకు పెంచినట్లు వెల్లడించారు. పని దినాలను 125 రోజులకు పెంచడంతో పాటు అవినీతి నివారణకు రాష్ట్రాల వాటా 40 శాతం నిబంధన తీసుకొచ్చామన్నారు.
ఆరోగ్యం – విద్య – పరిశ్రమలు
ఆరోగ్యం, విద్య రంగాలకు ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు 10 శాతం పెంచినట్లు తెలిపారు. రాష్ట్రాల మూలధన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయం కింద కేటాయింపులను 23 శాతం పెంచి రూ.1.85 లక్షల కోట్లకు చేర్చినట్లు చెప్పారు. గతంలో నిలిచిపోయిన 92 కేంద్ర పథకాల్లో 72 పథకాలను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పునరుద్ధరించామని వెల్లడించారు.
ఆటో ఇమ్యూన్ వ్యాధులు, ఆర్థరైటిస్ వంటి కొత్త రుగ్మతలకు అవసరమైన మందులను దేశంలోనే తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసేందుకు వచ్చే ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎయిమ్స్ తరహాలో ఆయుర్వేద వైద్యం కోసం మూడు ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
సెమీకండక్టర్లు, డ్రైవర్ లేని కార్ల టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి పెట్టామని, మొబైల్ ఫోన్ల విడిభాగాల తయారీకి రూ.40 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. చిప్స్ తయారీకి అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్ను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యం
టెక్స్టైల్ రంగ పునరుజ్జీవానికి 200కుపైగా పరిశ్రమలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించారు. మత్స్యకారుల కోసం ప్రత్యేక అసోసియేషన్లు, పశుసంరక్షణ కోసం వెటర్నరీ నిపుణుల సంఖ్య పెంపు చేపడతామన్నారు. కొబ్బరి, కోకో, జీడిపప్పు రైతులకు దళారీల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రతి జిల్లాలో మహిళల కోసం ప్రత్యేక హాస్టల్స్, స్వయం సహాయక సంఘాల మహిళల కోసం ‘షీ మార్ట్స్’ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ‘ఖేలో ఇండియా’ ద్వారా క్రీడలకు బడ్జెట్ పెంచామని, పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక కేటాయింపులు
అమరావతి అభివృద్ధికి రూ.1,400 కోట్లు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.400 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.3,300 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టులకు రూ.10 వేల కోట్లు కేటాయించగా, హైదరాబాద్–అమరావతి–చెన్నై హైస్పీడ్ రైల్వే కారిడార్ ఇందులో భాగమని చెప్పారు.
డేటా సెంటర్లకు 2047 వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో 5–6 డేటా సెంటర్లు ఏర్పడే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నంలో క్వాంటం వ్యాలీ వంటి ఆధునిక సాంకేతిక కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టామని తెలిపారు.ముస్లిం యువకులు పాలస్తీనా జెండా ఎగరేయడంతో కాకినాడలో చర్చలు||Palestine Flag Controversy in Kakinada During Milad-un-Nabi Observance
చివరగా, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నిజమైన డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉందని, కేంద్ర ప్రభుత్వ అవకాశాలు, నిధులను సమర్థవంతంగా వినియోగించి రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్గా, దేశాన్ని ప్రపంచంలో నంబర్ వన్గా నిలబెట్టేందుకు కృషి చేస్తామని సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.










