
విజయవాడ: నవంబర్ 12:-జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాల్లో మచిలీపట్నం హెడ్క్వార్టర్ గల జిల్లాకు వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని కృష్ణా జిల్లా సాధన సమితి అధ్యక్షులు కాలపాలెం బుజ్జి గారి ఆధ్వర్యంలో గవర్నర్పేట ప్రెస్క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జనసేన వైస్ ప్రెసిడెంట్ కామల్ల సోమనాదం, కాపు నాయకురాలు తుపాకుల రమణమ్మ, ఈశ్వరరావు, ఎర్రం శెట్టి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.వక్తలు మాట్లాడుతూ
వంగవీటి మోహన్ రంగా గారి పేరును కృష్ణా జిల్లాకు పెట్టాలని అభిమానులు ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్నారని, ఈ విషయంలో ఒక సబ్ కమిటీ వేస్తామని క్యాబినెట్ మీటింగ్లో చర్చించారని గుర్తు చేశారు.కాలపాలెం బుజ్జి మాట్లాడుతూ, “ఎన్నికల ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అచ్చం నాయుడు, సోమ వీర్రాజు గార్లను కలిసి రంగా గారి పేరును జిల్లా పేరుగా పెట్టాలని కోరాం. వారు అంగీకరించారు. ఆ హామీని ఇప్పుడు నిలబెట్టుకోవాలి. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి” అని డిమాండ్ చేశారు.
అలాగే ఆయన మాట్లాడుతూ,
“రెండు రోజుల క్రితం ఒక మీడియా వ్యక్తి రంగా గారి పేరును ఎందుకు జిల్లాకు పెట్టాలి, ఆయన ముఖ్యమంత్రి అయ్యారా అని అడిగారు. దానికి నేను ‘రాజశేఖర్ రెడ్డి గారు, ఎన్టీఆర్ గారు మాత్రమే ముఖ్యమంత్రులుగా అయ్యారు కాబట్టి వారి పేర్లే పెట్టాలా?’ అని ప్రశ్నించాను. రంగా గారి మరణం తర్వాత 41 రోజులు కర్ఫ్యూ విధించారు అంటే ఆయనకు ఎంత ప్రజాదరణ ఉందో అర్థం అవుతుంది,” అని అన్నారు.ప్రభుత్వం కొత్త జిల్లాల పేర్లలో రంగా గారి పేరు లేకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతామని, అవసరమైతే రంగా హత్య కేసు ఫైల్ను మళ్లీ తెరవాలని కోర్టులను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.అదేవిధంగా ఆయన మాట్లాడుతూ.
ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రుల బకాయిల్లో ఉన్న రూ.2000 కోట్లను విడుదల చేయకుండా విగ్రహాలకు ఎందుకు డబ్బులు వెచ్చిస్తోంది?” అని ప్రశ్నించారు.డిసెంబర్ 26న వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని కాలపాలెం బుజ్జి వెల్లడించారు.







