
లండన్, నవంబర్ 03:–అంతర్గత జలరవాణా మార్గాల ద్వారా తక్కువ వ్యయంతో సరుకు రవాణా చేసే అవకాశం ఏపీలో విస్తారంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. లాజిస్టిక్స్ కారిడార్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు.లండన్ పర్యటనలో భాగంగా సోమవారం సీఎం చంద్రబాబు వివిధ పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని, ఈ నెలలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు హాజరుకావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.రాష్ట్రంలో రోడ్డు, రైలు, వాయు మార్గాలతో పాటు జల వనరులను ఉపయోగించి అంతర్గత జల రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. ఈ దిశగా లండన్లోని ప్రముఖ నిర్మాణ సంస్థ అరుప్ ముందుకు రావాలని కోరారు.
ఈ సమావేశంలో అరుప్ గ్లోబల్ అఫైర్స్ డైరెక్టర్ జేమ్స్ కెన్నీ, అల్తెరిన్ టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రెడీ వూలాండ్, పీజీ పేపర్ సీఈఓ పూనమ్ గుప్తా, WMG యూనివర్సిటీ ప్రతినిధి గౌరవ్ మార్వాహా, మాంఛెస్టర్ యూనివర్సిటీ నానోసైన్స్ ప్రొఫెసర్ రాధాబోయా, ఏఐ పాలసీ ల్యాబ్స్ ఫౌండర్ డైరెక్టర్ ఉదయ్ నాగరాజు, ఫ్లుయెంట్ గ్రిడ్ ప్రెసిడెంట్ రత్న గారపాటి, బ్రిటిష్ హెల్త్ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రతినిధి పాల్ బెంటన్ తదితరులు పాల్గొన్నారు.ఏపీలో టెక్నాలజీ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం చెప్పారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు జరుగుతోందని, అమరావతిలో వచ్చే జనవరి నాటికి ఏఐ క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ప్రారంభం కానుందని తెలిపారు.ఏఐ వినియోగం, నిపుణుల తయారీతో పాటు ఎకోసిస్టం అభివృద్ధి దిశగా కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వివరించారు. అలాగే అరుదైన భూగర్భ ఖనిజాల వెలికితీతలో యూనివర్సిటీల భాగస్వామ్యం అవసరమని, వాటిని వెలికితీసి ప్రపంచ అవసరాలకు వినియోగించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
 
 






