
అమరావతి, మార్చి 23: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యలను అధిగమించడానికి పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) మరియు విద్యుత్ ఆధారిత గృహోపకరణాల వినియోగాన్ని పెంచడమే సరైన పరిష్కారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ ద్వారా ఎల్పీజీ సరఫరా, అకాల వర్షాల పంట నష్టం మరియు సాంకేతికత వినియోగంపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పీఎన్జీ కనెక్షన్లు ఇచ్చేలా తక్షణ కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2.34 లక్షల కనెక్షన్లలో కేవలం 60 వేలు మాత్రమే వినియోగంలో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, దీనిని వంద శాతం వినియోగించుకోవడంతో పాటు, ప్రతి జిల్లాకు కనీసం 10 వేల కొత్త కనెక్షన్లు ఇవ్వాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. శ్రీకాకుళం-కాకినాడ పైప్ లైన్ పునరుద్ధరణ కోసం కేంద్ర మంత్రికి లేఖ రాయాలని, ఏపీ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని సూచించారు. వచ్చే కేబినెట్ సమావేశానికి ‘నేచురల్ గ్యాస్ పాలసీ ఫర్ ప్రమోషన్ ఇన్ కమర్షియల్ సెక్టార్’ విధానాన్ని తీసుకురావాలని ఆదేశించారు.

ఎల్పీజీ సిలిండర్ల పంపిణీలో విద్యా సంస్థలు, ఆస్పత్రులు, అంగన్వాడీలు, అన్న క్యాంటిన్లు మరియు హోటళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్యాస్ సంక్షోభాన్ని విద్యుత్ రంగానికి ఒక అవకాశంగా మలుచుకుని, ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు వంటి ప్రత్యామ్నాయ వనరుల వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. గత ఐదు రోజులుగా రోజుకు సగటున 1.80 లక్షల గృహావసర సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని, మరో 14,444 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు ఉన్నాయని అధికారులు వివరించారు. మరోవైపు, అకాల వర్షాల వల్ల సంభవించిన పంట నష్టంపై ప్రాథమిక వివరాలను చర్చించిన సీఎం, ఈ నెల 26వ తేదీ కల్లా నష్ట అంచనాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదన పెరుగుతున్న నేపథ్యంలో పంటల నిర్వహణ మరియు మార్పిడిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.https://www.youtube.com/embed/3kc3SzKdRUE?si=q-WrVZ5kkLaOgcth
పరిపాలనలో సాంకేతికత వినియోగం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని, దీనికి తిరుమలలో ఏఐ (కృత్రిమ మేధ) సాయంతో పెరిగిన దర్శనాల సంఖ్యే నిదర్శనమని ముఖ్యమంత్రి కొనియాడారు. ఏఐ సాంకేతికత వల్ల క్యూలైన్ల నిర్వహణ మెరుగుపడి, నిరీక్షణ సమయం తగ్గిందని, ఫలితంగా 20 శాతం వరకు భక్తులు అదనంగా శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం లభించిందన్నారు. తిరుమలలో అత్యాధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా ప్రసాదాల క్వాలిటీ చెక్ చేస్తున్నామని, భవిష్యత్తులో కల్తీకి ఆస్కారం ఉండదని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఇదే తరహాలో అన్ని ప్రభుత్వ శాఖలు ఏఐ ఇంటిగ్రేషన్ మరియు సాంకేతికత ద్వారా మెరుగైన ప్రజా సేవలను అందించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఐఓటీ పరికరాలు, సెన్సార్లు, సీసీ టీవీ వివరాలతో త్వరగా నిర్ణయాలు తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. డ్రోన్ల వినియోగం ద్వారా సాగు వ్యయం తగ్గించి, ఉత్పత్తి పెరిగేలా చూడాలని, పొరుగు రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో బ్యాండ్ విడ్త్ పెంచి, డేటా వినియోగం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు కొలుసు పార్థ సారధి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.







