
– ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్
– ఈ నెల 12న 100 మీటర్ల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ
బాపట్ల: దేశ భవిష్యత్తుకు ముప్పుగా మారుతున్న మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారిని తరిమికొట్టేందుకు బాపట్లలో ఈ నెల 12వ తేదీన ‘దండి మార్చి 2.0’ పేరిట భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను సోమవారం బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ (ఐపీఎస్) తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం స్ఫూర్తితో “వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్” ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య సంగ్రామంలో మహాత్మా గాంధీ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించేందుకు చేపట్టిన ‘దండి మార్చి’ స్ఫూర్తితో.. నేడు డ్రగ్స్ రహిత సమాజమే ధ్యేయంగా ఈ యాత్రను చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

యువత డ్రగ్స్ బారిన పడితే దేశ భవిష్యత్తు అంధకారమే.. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. దేశాన్ని ముందుకు నడిపించే మహా శక్తి యువతేనని, వారు డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసైతే దేశ భవిష్యత్తు అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు పోలీసులకు సహకరిస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.
12న భారీ ర్యాలీ, ప్రతిజ్ఞ ఈ నెల 12వ తేదీన వేలాది మంది విద్యార్థులతో నిర్వహించనున్న ‘దండి మార్చి 2.0’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. 100 మీటర్ల పొడవైన జాతీయ పతాకంతో సాగే ఈ భారీ ర్యాలీతో పాటు, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమం ప్రజల్లో గొప్ప స్ఫూర్తిని నింపుతుందని ఆయన ఆకాంక్షించారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, ఇలాంటి సామాజిక చైతన్య కార్యక్రమాలకు పోలీస్ శాఖ తరపున పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల ఈగిల్ సెల్ సిబ్బంది, రోజు ఆర్గనైజేషన్ అధ్యక్షులు పొందుగుల ప్రసాద్, శ్రీ భావపురి విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ఆవుల వెంకటేశ్వర్లు, మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి గురజాల శ్రీనివాసరావు, ఎం. జాకబ్, ఆర్.టి.ఐ. ఉపాధ్యక్షులు పి. ప్రసాద్ తదితర ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.bapatla news







