
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు: డీఎస్పీ బి. జనార్ధనరావు – నిందితులను గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు గారి ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై తెనాలి పోలీసులు కొరడా ఝుళిపించారు. ఈ వ్యవహారంపై తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు డీఎస్పీ బి. జనార్ధనరావు బుధవారం మీడియాకు వెల్లడించారు.
బాధ్యులపై విచారణ
మారీస్ పేటకు చెందిన వెనిగళ్ళ నారాయణరావు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్విట్టర్ (X) వేదికగా నాదెండ్ల భాస్కరరావు గారి పేరుతో ఒక ఫేక్ వీడియో హల్ చల్ చేస్తోందని, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వదిలే ప్రసక్తి లేదు
ఈ సందర్భంగా డీఎస్పీ బి. జనార్ధనరావు మాట్లాడుతూ.. “ట్విట్టర్లో ఈ తప్పుడు పోస్టు పెట్టిన వ్యక్తిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. నిందితులను త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని వదిలే ప్రసక్తి లేదు,” అని హెచ్చరించారు.
పోలీసుల విజ్ఞప్తి
సోషల్ మీడియాను వినియోగించే వారు బాధ్యతాయుతంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. “ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు అది నిజమో కాదో నిర్ధారించుకోవాలి. తప్పుడు సమాచారాన్ని, ఫేక్ వీడియోలను పంచుకోవడం నేరమని గుర్తుంచుకోవాలి,” అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకులు మరియు ప్రముఖులపై అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.Guntur news 18-01-2025 News Part-1 #gunturnews #ponnuru #tenali #mangalagiri #tadikonda #prathipadu







