
సొంత నిధులతో ఎకరం భూమి కొనుగోలు.. ఎస్సీ సామాజికవర్గానికి అప్పగింత – అభివృద్ధిలో పోటీ పడదాం.. కుట్రలు, గొడవలు వద్దు: పొన్నం బాలాజీ పిలుపు
పెనుగంచిప్రోలు (ఎన్టీఆర్ జిల్లా), మార్చి 4: దశాబ్దాల కాలంగా పరిష్కారం కాని ఓ ప్రధాన సమస్యకు పెనుగంచిప్రోలు మండలంలోని గుమ్మడిదూరు గ్రామంలో శుభం కార్డు పడింది. గ్రామంలోని ఎస్సీ సామాజికవర్గం ఎదుర్కొంటున్న శ్మశాన వాటిక సమస్యను పరిష్కరించేందుకు గ్రామ పెద్ద పొన్నం బాలాజీ ముందుకొచ్చారు. తన సొంత నిధులతో ఎకరం పొలాన్ని కొనుగోలు చేసి, దానిని శ్మశాన వాటిక కోసం కేటాయించి ఉదారత చాటుకున్నారు.
దశాబ్దాల సమస్య.. అభయమిచ్చిన బాలాజీ
గుమ్మడిదూరు గ్రామంలో ఎన్నో ఏళ్లుగా శ్మశాన వాటిక లేక ఎస్సీలు పడుతున్న అవస్థలను గ్రామస్తుడు నక్క వెంకట్రావు మరియు ఇతర కుల పెద్దలు పొన్నం బాలాజీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన బాలాజీ, తన సొంత ఖర్చుతో భూమిని కొని ఇస్తానని గతంలో హామీ ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారం బుధవారం ఎకరం పొలాన్ని కేటాయించడంతో ఎస్సీ సామాజికవర్గ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ బాలాజీ దంపతులను ఘనంగా సన్మానించారు.
రాజకీయం ఎన్నికల వరకే.. అభివృద్ధిలో పోటీ పడదాం!
ఈ సందర్భంగా పొన్నం బాలాజీ మాట్లాడుతూ.. “నక్క వెంకట్రావు గారు ఈ సమస్యను నా దృష్టికి తెచ్చినప్పుడే హామీ ఇచ్చాను. ఈరోజు ఆ మాట నిలబెట్టుకోవడం సంతోషంగా ఉంది. గ్రామంలో రాజకీయం అనేది కేవలం ఎన్నికల సమయానికే పరిమితం కావాలి. మిగతా సమయంలో అందరూ కలిసి గ్రామ అభివృద్ధికి సహకరించాలి. మంచి పనులతో పోటీ పడదాం తప్ప, కుట్రలు పన్నడం, గొడవలు పెట్టుకోవడం మన సంస్కృతి కాదు,” అని హితవు పలికారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ సేవా కార్యక్రమంలో పొందూరు నాగేశ్వరరావు, నక్క వెంకట్రావు (విలేఖరి), యార్లగడ్డ విశ్వనాథం, కంచెటి రాంబాబు, మండెపూడి రామ్మోహన్ రావు, నక్క సుధాకర్, నక్క చిన్న పుల్లయ్య, ఆలూరి శ్రీనివాసరావుతో పాటు పలువురు గ్రామ రైతులు, ఎస్సీ సంఘ నేతలు పాల్గొన్నారు. కులాలకు అతీతంగా బాలాజీ చేసిన ఈ కృషిని గ్రామస్తులంతా కొనియాడారుhttp://NTR DISTRICT NEWS.







