GUNTUR NEWS: శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ పనులు ఆపే ప్రసక్తే లేదు: పెమ్మసాని చంద్రశేఖర్
CHEQS DISTRIBUTION IN GUNTUR CORPORATION
నగరంలో శంకర్ విలాస్ వద్ద ఆర్వోబీని అత్యుత్తమ డిజైన్లతో అందరికీ ఆమోదయోగ్యంగా అతి తక్కువ కాలంలోనే ఖచ్చితంగా నిర్మాణం చేపట్టనున్నామని, అనవసర అపోహాలకు గురి కాకుండా ప్రజలు సహకరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశమందిరంలో శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణ ప్రభావిత భవనాల యజమానులకు నిర్మాణ పరిహారం అందించే కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ , జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ ఇన్ చార్జి మేయరు షేక్ సజీలా, శాసనసభ్యులు నసీర్ అహ్మద్, గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, రాష్ట్ర ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర రావుతో కలసి పాల్గొన్నారు. ఆర్వోబీ నిర్మాణ ప్రభావిత భవనాల యజమానులలో తొలుత సమ్మతి తెలిపిన 21 మందికి సంబంధించిన నిర్మాణాల నష్టపరిహారం నిమిత్తం రూ. 71 లక్షల చెక్కులను కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ అందించారు. ఈ సంధర్భంగా కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ 1950 లో నిర్మించిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ శిధిలావస్థకు చేరుకుందని, దీనిపై ట్రాఫిక్ రద్దీ కారణంగా సమీపంలోని జీజీహెచ్ కు అత్యవసర చికిత్స నిమిత్తం వచ్చే రోగులు మరణిస్తున్న సంఘటనలు జరుగుతున్నాయన్నారు. గుంటూరు జిల్లాకు 40 ఏళ్ళ అనంతరం దక్కిన కేంద్ర మంత్రి పదవిని అదృష్టంగా భావిస్తూ దీనిని సద్వినియోగం చేసుకొని కేంద్రంలో గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు సహకారంతో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి అతితక్కువ కాలంలోనే అన్ని రకాల అనుమతులు , నిధులు మంజూరు చేయటం జరిగిందన్నారు. గతంలో నగరంలో నందివెలుగు రోడ్డులో ఆర్వోబీని 2014 లో మంజూరు చేస్తే పనులు ప్రారంభించటానికి 2017 వరకు సమయం పట్టిందని, కానీ శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి అవరమైన అన్ని ప్రక్రియలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో ఆరు నెలల్లోనే పూర్తి చేయటం జరిగిందన్నారు. పరిపాలన, సాంకేతిక అనుమతులు మంజూరు తో పాటు టెండరు ప్రక్రియను పూర్తి చేసి అవసరం అనుకుంటే రేపే పనులు ప్రారంభించేలా సిధ్దంగా ఉన్నామన్నారు. ఆర్వోబీ నిర్మాణంపై కొంత మంది కావాలని అపోహాలు సృష్టిస్తున్నారని, రహదారి విస్తరణ కోసం అక్కడ జీవనోపాధి పొందుతున్నవారికి కొంత ఇబ్బంది జరుగుతుందని కానీ విశాలదృక్పథంతో అర్ధం చేసుకొని స్థలాలు ఇవ్వటానికి స్వయంగా వచ్చి సమ్మతించిన భవన యజమానులకు కూటమి ప్రభుత్వం తరుపున మనస్పూర్తిగా అబినందనలు తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వం నష్టం వాటిల్లే భవన యజమానులకు సాధ్యం అయినంత వరకు పరిహారం అందిస్తుందన్నారు. ప్రజలను అయోమయానికి గురిచేసే లేనిపోని అర్ధం పర్ధం లేని ఆరోపణలు తీసుకువచ్చి అపోహలు కల్పించవద్దన్నారు.