
పర్చూరు: రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమం, స్వావలంబన కోసం కూటమి ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం మంగళగిరిలో ఘనంగా ప్రారంభించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11.16 లక్షల మంది దివ్యాంగులకు నేరుగా లబ్ధి చేకూరుతుందని, సహాయకులతో కలిపి మొత్తం 12.76 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
గతంలో ఉన్న పరిమితులను సడలిస్తూ, 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ముఖ్యంగా వైకల్య వర్గాల సంఖ్యను 4 నుండి 21కి పెంచి, విస్తృత స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల సహాయకులకు కూడా టికెట్ ధరలో 50 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉచిత ప్రయాణ పథకం అమలు కోసం ప్రభుత్వం ఏటా రూ. 207 కోట్లు ఆర్టీసీకి భరించనుంది. ఉగాది కానుకగా ఈ పథకాన్ని అందిస్తున్నామని, గతంలో ఇచ్చిన హామీని కేవలం రెండు నెలల్లోనే నెరవేర్చడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఏలూరి సాంబశివరావు కొనియాడారు.
ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి, అనంతరం వారితో సహపంక్తి భోజనం చేయనున్నారని తెలిపారు. పర్చూరు నియోజకవర్గంలో ఉదయం 11 గంటలకు పర్చూరు బస్టాండ్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడిస్తూ, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే మహిళల కోసం ‘స్త్రీశక్తి’ విజయవంతంగా నడుస్తోందని, ఇప్పుడు ‘దివ్యాంగ శక్తి’ ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.http://BAPATLA NEWS







