
రేపల్లె, మార్చి 31: బాపట్ల జిల్లాలోని మత్స్యకార గ్రామాల అభివృద్ధి, మత్స్యకారుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ మత్స్య కార్మిక సంఘం (CITU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలాటి శ్రీను డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా సాగుతున్న మత్స్యకార కార్మికుల యాత్రలో భాగంగా మంగళవారం రేపల్లె మండల పరిధిలోని మోళ్ళగుంట, పిరాట్లంక, పెనుమూడి, లంకెవానిదిబ్బ, గంగడిపాలెం తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అర్హులైన అనేకమంది మత్స్యకారులకు వేట నిషేధ భృతి పెండింగ్లో ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మత్స్యకారులను మోసం చేస్తోందని, తక్షణమే రాయితీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా వాడరేవు ఫిషింగ్ హార్బర్ను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని, ఈపురుపాలెం స్ట్రైట్ కట్ ఎల్లాకారంలో ఉన్న ముఖ ద్వారాన్ని పునరుద్ధరించాలని కోరారు. అలాగే, కొత్తగా అభివృద్ధి చేస్తున్న టూరిజం ప్రాజెక్టులలో మత్స్యకార యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ త్వరలోనే బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ జాతాలో మత్స్య కార్మిక సంఘం, చేతి వృత్తిదారుల సంఘం మరియు CITU నాయకులు ఎన్. బాబురావు, ఎం. కొండయ్య, ఏసుబాబు బాబ్జి, ఆర్య, ప్రతాప్, సిహెచ్. మణిలాల్, టి. కృష్ణమోహన్, కే. శరత్ బాబు, బి. అగస్టిన్, మనోజ్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారుhttp://BAPATLA NEWS







