80 శాతం పోలింగ్ అయిన బూత్ లో రీపోలింగ్ జరపాలి….
సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఘటన ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ అని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తారని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ అన్నారు. శుక్రవారం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ గురువారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థిని అక్రమంగా గెలిపించేందుకు రిగ్గింగ్ కు పాల్పడిందని అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు పోలింగ్ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి దౌర్జన్యానికి పాల్పడడం తగదన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడే బదులు ఎమ్మెల్సీ ఎన్నికలను గవర్నర్ మాదిరి నామినేట్ చేసుకోవాల్సిందని ఎద్దేవాచేశారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పిడిఎఫ్ ఏజెంట్ల పై దుర్భాషలాడటం ఆయన స్థాయికి తగదన్నారు. బెల్లంకొండలో పిడిఎఫ్ ఏజెంట్లను వందమందికి పైగా టిడిపి వర్గీయులు చుట్టుముట్టి బంధించారన్నారు. మాచర్ల, గురజాల ఎమ్మెల్యేలు సిపిఎం నాయకులను భయభ్రాంతులకు గురి చేశారన్నారు.ఓటమి తప్పదని గ్రహించిన కూటమి ప్రభుత్వం చివరి గంటలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రిగ్గింగ్ పాల్పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 80 శాతం కంటే ఎక్కువ పోలింగ్ జరిగిన ప్రతి బూత్ లో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు.కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల వ్యవస్థను విస్మరించి దుర్మార్గంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి కల్లబొల్లి కబుర్లు చెప్పే రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు. 75 ఏళ్ల వయసు 45 ఏళ్ల రాజకీయ జీవితం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి కోసం ఈ విధంగా దిగజారడం ఆయన స్థాయికి తగదన్నారు విద్యావంతులు మండలి లో ఉంటే ప్రశ్నిస్తారని కావాలని అక్రమంగా గెలిచేందుకు దొంగ ఓట్లు వేయించారని ఇదేమని ప్రశ్నించిన పిడిఎఫ్ ఏజంట్లపై దాడులకు పాల్పడినా రెవిన్యూ, పోలీసు, కమిషనర్లు ప్రభుత్వ యంత్రాంగం మిన్నకుండిపోయారన్నారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.ఆంజనేయ నాయక్ మాట్లాడుతూ 30 ఏళ్ల పాటు రాజకీయాలు చేస్తామని ప్రగల్బాలు పలికిన వారికి ఇటీవల ఎన్నికలలో ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో గ్రహించాలన్నారు. ఎన్నికల హామీలు అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలని హితవు పలికారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడతామని పీడిత ప్రజల సంక్షేమం కోసం కలిసొచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకొని పోరాటం చేయడంతో పాటు ప్రజలలో చైతన్యం నింపుతామన్నారు.