
జగ్గయ్యపేట (వత్సవాయి): ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని, నిర్ణయించిన మద్దతు ధరకే పంటను కొనుగోలు చేయాలని స్థానిక శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) డిమాండ్ చేశారు. మంగళవారం వత్సవాయి మండలం మంగొల్లు గ్రామంలో సాగు చేసిన మొక్కజొన్న పంట పొలాలను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మార్కెట్లో తక్కువ ధర.. రైతుల ఆవేదన
పంట పొలాల పరిశీలన సందర్భంగా ఎమ్మెల్యే రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటూ.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 2400 ఉండగా, బహిరంగ మార్కెట్లో వ్యాపారులు కేవలం రూ. 1700 మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉందని, తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రితో ఫోన్లో చర్చ
రైతుల పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చం నాయుడుతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు.NTR VIJAYAWADA News
- ముఖ్య అంశాలు:
- జగ్గయ్యపేట నియోజకవర్గంలో సుమారు 17 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది.
- దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి.
- ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ చేపట్టాలి.
మంత్రి హామీ
ఎమ్మెల్యే విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి అచ్చం నాయుడు, ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి ఇవే విజ్ఞప్తులు వస్తున్నాయని, రైతు ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీ కెనాల్ వైస్ చైర్మన్ మన్నె నారాయణరావు, మంగొల్లు సొసైటీ చైర్మన్ బొల్లం పురుషోత్తం, మాజీ సర్పంచ్ కాకనబోయిన పాండురంగారావు, రైతు వడ్డంపుడి అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.







