BAPATLA NEWS: చీరాల పురపాలక సంఘం కార్యాలయంలో కలెక్టర్ ప్రత్యేక సమావేశం
BAPATLA COLLECTOR MEETING
చీరాల నియోజకవర్గం అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలని, బీచ్ లను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. చీరాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, పర్యాటక ప్రాంతం అభివృద్ధిపై జిల్లా స్థాయి అధికారులతో సోమవారం చీరాల పురపాలక సంఘం కార్యాలయంలో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం చీరాల స్మశాన వాటికను కలెక్టర్, జేసీ, శాసనసభ్యులు పరిశీలించారు. చీరాలలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.10.2 కోట్ల నిధులతో జల జీవన్ మిషన్ కింద పనులు చేపడతామని జిల్లా కలెక్టర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరా కొరకు రూ.60 లక్షలు ఆర్ డబ్ల్యు ఎస్ ద్వారా మంజూరు చేస్తామన్నారు. చీరాల పరిధిలోని అయిదు ఎత్తిపోతల పథకాలు మరమ్మతులు చేయడానికి యుద్ధప్రాతిపదికన ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8.25 కోట్లతో అభివృద్ధి పనులు చేయడానికి నిధులు కేటాయింపులు జరగ్గా అదనంగా మరో రూ.1.75 కోట్ల నిధులు వెచ్చిస్తామన్నారు. డి ఎం ఎఫ్ కింద మరో రూ.రెండు కోట్ల నిధులు బీచ్ అభివృద్ధికి మంజూరు చేస్తామన్నారు. వివిధ శాఖలు, ఆయా పథకాల ద్వారా మరో రూ.రెండు కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.1.50 కోట్లతో చీరాల పట్టణంలో మురికి నీటి వ్యవస్థ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలు, నిధులను వెచ్చించడానికి పరిశీలిస్తామన్నారు. రూ.150 కోట్లతో చీరాలలో ఫిషింగ్ హార్బర్ నిర్మించడానికి తయారు చేసిన డిపిఆర్ ను యుద్ధ ప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలన్నారు. చీరాల వాడరేవు, రామాపురం బీచ్ లలో బయో టాయిలెట్స్ నిర్మిస్తామన్నారు. పర్యాటక రంగంగా మారనున్న బీచ్ ల వద్ద రక్షణ చర్యలు పెంచాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైల్వే ట్రాక్ పై ఆర్ఓబి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. మసీద్ సెంటర్లో, పేరాల రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ ను నియంత్రించాలన్నారు. చీరాల పట్టణంలో నిరుపేదలకు ఇంటి స్థల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అభివృద్ధి పనుల వేగంగా చేపట్టడానికి కొన్నిటికి ప్రతిపాదనలు పంపడం, కొన్నిటికి టెండర్లు పిలవాలని, మరికొన్ని పనులు ప్రారంభించాలని అధికారులకు మార్గ నిర్దేశం చేశారు. పనులలో జాప్యం చేయరాదని అధికారులకు సూచనలు చేశారు. ప్రతి నెల రెండు రోజులు నియోజకవర్గస్థాయిలో పీజీ ఆర్ఎస్ నిర్వహిస్తామని తెలిపారు. అదే క్రమంలో నియోజకవర్గాల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష చేస్తామన్నారు.