
కానూరు: డిసెంబరు 30, 2025:-పరిశ్రమల ఏర్పాటుకు భూ కేటాయింపులు జరిగి అనుమతులు పొందిన యూనిట్ల స్థాపనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు.

మంగళవారం ఉదయం పెనమలూరు నియోజకవర్గం కానూరు 100 అడుగుల రోడ్డులోని అన్నే వారి కళ్యాణ మండపంలో జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో పారిశ్రామికవాడల్లో నెలకొన్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు ప్రస్తావించిన సమస్యలను కలెక్టర్ ఓపిగ్గా ఆలకించి, సాధ్యమైన వాటిని అక్కడికక్కడే సంబంధిత అధికారులతో పరిష్కరించారు. జిల్లా పరిధిలో పరిష్కరించలేని అంశాలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం “ఒక ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త” లక్ష్యంగా పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ తెలిపారు. ఈ క్రమంలో పారిశ్రామికవాడల్లో మౌలిక వసతులు కల్పిస్తూ, పలు ప్రభుత్వ రాయితీలు అందిస్తున్నామని, పారిశ్రామికవేత్తలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పారిశ్రామికవేత్తలు తమ సమస్యలను రాతపూర్వకంగా సమర్పించాలని, పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు పంపిస్తామని తెలిపారు. ప్రతి 20 మంది పారిశ్రామికవేత్తలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి, వారి నివేదికల ఆధారంగా తరచూ ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
మల్లవల్లి, వీరప్పనేనిగూడెం పారిశ్రామికవాడల్లో మౌలిక వసతులు కల్పించాలని పలువురు పారిశ్రామికవేత్తలు కోరారు. మల్లవల్లి పారిశ్రామికవాడలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశిస్తూ, నిర్వహణ బాధ్యతలను ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) చేపట్టాలని సూచించారు.సంక్రాంతి “సంబరాల్లో “MP,వల్లభనేని బాలశౌరి
సిబ్బందికి నివాస క్వార్టర్స్ నిర్మాణానికి స్థలం కేటాయించాలన్న విజ్ఞప్తిపై సమీపంలోని ప్రభుత్వ భూములను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సేల్ డీడ్ అగ్రిమెంట్ ఉన్నప్పటికీ బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదన్న అంశాన్ని లీడ్ బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో గుడివాడ ఆర్డీవో జి. బాలసుబ్రమణ్యం, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్. వెంకట్రావు, మల్లవల్లి పారిశ్రామికవాడ చైర్మన్ జి. రవికుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.







