
అమరావత:డిసెంబర్ 17:-కూటమి ప్రభుత్వం పట్టు రైతులకు అండగా నిలిచి, గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న స్టేట్ షేర్ నిధులను పూర్తిస్థాయిలో విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సిల్క్ సమగ్ర–2 పథకం కింద 2023–24, 2024–25 సంవత్సరాలకు సంబంధించిన వివిధ పథకాల కోసం పట్టు పరిశ్రమల శాఖకు మ్యాచింగ్ స్టేట్ షేర్గా రూ.14 కోట్లను విడుదల చేసినట్లు వెల్లడించారు.
ఈ మొత్తంలో నుంచి రూ.13.75 కోట్లకు సంబంధించిన బిల్లులు గుంటూరు పే అండ్ అకౌంట్స్ కార్యాలయానికి సమర్పించగా, లబ్ధిదారులకు నేరుగా చెల్లింపులు పూర్తయ్యాయని చెప్పారు. 2021–22 సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్న స్టేట్ షేర్ నిధులను క్లియర్ చేసినట్లు మంత్రి తెలిపారు.
ఈ నిధుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 13,663 మంది సిల్క్ రైతులు లబ్ధి పొందారని, మల్బరీ తోటల అభివృద్ధి, పట్టు పురుగుల పెంపక షెడ్లు, కిసాన్ నర్సరీలు, డిస్ఇన్ఫెక్టెంట్లు, రీరింగ్ పరికరాల సరఫరా, ట్విస్టింగ్ యూనిట్లు, బేసిన్ మౌంటెడ్ రీలింగ్ యూనిట్లు, IARM కార్యక్రమాలు, ప్రైవేట్ గ్రైనేజ్ల ఏర్పాటు వంటి అంశాలపై వ్యయం చేసినట్లు తెలిపారు.Amaravathi -visakha
సకాలంలో నిధుల విడుదలతో పట్టు పరిశ్రమకు కొత్త ఉత్సాహం లభించిందని, సిల్క్ రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా పట్టు రైతులు, రీలర్లకు అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు.







