
పెదపాడు:– నేర నియంత్రణతో పాటు వ్యాపార సంస్థల భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో సీసీ కెమెరాల ఏర్పాటు అత్యవసరమని పెదపాడు ఎస్సై ఆర్. శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా నేర నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నూజివీడు డీఎస్పీ శ్రీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ సూచనలతో, పెదవేగి ఇన్స్పెక్టర్ శ్రీ సిహెచ్. రాజశేఖర్ ఆధ్వర్యంలో పెదపాడు ఎస్సై శ్రీ ఆర్. శ్రీనివాస్ స్థానిక వర్తక సంఘం యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, దుకాణాలు, వ్యాపార సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు. సీసీ కెమెరాలు కేవలం నిఘా కోసమే కాకుండా, ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకునే విషయంలో పోలీసులకు “మూడవ కన్ను”గా ఉపయోగపడతాయని వివరించారు.
వ్యాపారస్తులు తమ షాపుల లోపలతో పాటు బయట రహదారి స్పష్టంగా కనిపించేలా నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, రికార్డింగ్ నిరంతరం కొనసాగించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యాపారస్తులు భయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛగా వ్యాపారాలు నిర్వహించుకునేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ELURU JILLA VAARATHALU
ప్రతి ఒక్కరూ బాధ్యతగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పెదపాడు గ్రామ వర్తక సంఘం అధ్యక్షులు, సంఘ సభ్యులు, స్థానిక వ్యాపారస్తులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










