
బాపట్ల: తెలుగు సాహితీ వనంలో అసామాన్య కీర్తిని గడించిన మహా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్లమ్మ) జయంతి వేడుకలను బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో, సిసిఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్ పాల్గొని మొల్లమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆర్.ఐ. షేక్ మౌలుద్దీన్ తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

యువతకు స్ఫూర్తిదాయకం ఆమె జీవితం.. ఈ సందర్భంగా డీఎస్పీ జగదీష్ నాయక్ మాట్లాడుతూ.. సామాన్య కుమ్మరి కుటుంబంలో జన్మించిన మొల్లమ్మ అసాధారణ కీర్తిని సొంతం చేసుకోవడం ప్రతి ఒక్కరికీ గర్వకారణం అన్నారు. ఉమ్మడి కడప జిల్లా గోపవరం గ్రామంలో కేసన శెట్టి దంపతులకు జన్మించిన ఆమె ఎంతో స్వతంత్ర భావాలతో పెరిగారని గుర్తుచేశారు. 16వ శతాబ్దంలో మహిళలకు విద్య, సాహిత్యం అంత సులభం కాని ఆ రోజుల్లోనే, తన కవితా శక్తితో శ్రీకృష్ణదేవరాయల వంటి మహారాజుల ఆస్థానంలో ప్రశంసలు పొందడం ఆమె పట్టుదలకు నిదర్శనమని కొనియాడారు. పరిమిత వనరులున్న ఒక చిన్న గ్రామంలో పుట్టి, ఉన్నత స్థాయికి ఎదిగిన మొల్లమ్మ జీవితం నేటి యువతకు, ముఖ్యంగా మహిళలకు గొప్ప స్ఫూర్తిదాయకమన్నారు.

సామాన్యుల భాషలో ‘మొల్ల రామాయణం’.. మొల్లమ్మ రచించిన ‘మొల్ల రామాయణం’ కృతి తెలుగు సాహిత్యంలో ఒక విప్లవమని డీఎస్పీ అభివర్ణించారు. పండితులకే పరిమితమైన రామాయణాన్ని సామాన్యులకు సైతం ఇట్టే అర్థమయ్యేలా అత్యంత సరళమైన వాడుక భాషలో, రమణీయమైన శైలిలో ఆమె రచించారని ప్రశంసించారు. లక్ష్యం పట్ల అంకితభావం, అకుంఠిత దీక్ష ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించి విజయం సాధించవచ్చని ఆమె నిరూపించారని తెలుపుతూ వినమ్ర పూర్వకంగా నివాళులర్పించారు.Bapatla Local News






