
రేపల్లె, మార్చి 23: ప్రజల వద్దకు పరిపాలనను తీసుకువెళ్లడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం రేపల్లె మండల కేంద్రంలోని పత్తిపాటి సీతారామ యోగిని & పాలాటి రాజ్యలక్ష్మి స్మారక కళ్యాణ మండపంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ భావన, డి.ఆర్.ఓ గంగాధర్ గౌడ్లతో కలిసి వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకుని, వారి నుంచి వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రానికి రాలేని దూర ప్రాంత ప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం ఒక రెవెన్యూ డివిజన్ లేదా నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేటి కార్యక్రమంలో మొత్తం 238 అర్జీలు అందాయని, వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నెల రోజుల్లోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 24 నుండి 48 గంటల్లో పరిష్కరించాల్సిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు తమ రెవెన్యూ సమస్యల కోసం గ్రామ సచివాలయాల్లో చలానా చెల్లించి సేవలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ లవన్న, జిల్లా కలెక్టరేట్ ఏఓ మల్లికార్జున రావు, డి.ఎం.హెచ్.ఓ డాక్టర్ విజయమ్మతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.http://BAPATLA DISTRICT NEWS







