
చీరాల:– గత పదేళ్లుగా పట్టణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనంలో ఆధునిక వైద్య సౌకర్యాలతో సేవలు ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోమవారం హాస్పిటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి ఎండీ డాక్టర్ గోరంట్ల రాజేష్ వివరాలు వెల్లడించారు.
2016లో చీరాలలో వైద్య సేవలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. చీరాల, బాపట్లతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు సత్వర, నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆసుపత్రిని స్థాపించినట్లు పేర్కొన్నారు. కోవిడ్–19 వంటి కష్టకాలంలోనూ అత్యవసర సేవలు అందించి అనేక ప్రాణాలను కాపాడినట్లు గుర్తు చేశారు.
గతంలో గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలు వచ్చినప్పుడు గుంటూరు, విజయవాడ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఆ ప్రయాణంలోనే పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని తెలిపారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పట్టణంలోనే 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.Chirala Local News
గత ఒక సంవత్సరం కాలంలో 30 వేలకుపైగా ఓపీడీ కేసులకు, 4 వేలకుపైగా అత్యవసర కేసులకు చికిత్స అందించినట్లు చెప్పారు. కార్డియాలజీ విభాగం ద్వారా 200 మందికి యాంజియోగ్రాం పరీక్షలు, 70 మందికి పైగా గుండె స్టెంట్లు విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు.
న్యూరాలజీ విభాగం ద్వారా పక్షవాతం వచ్చిన రోగులకు తక్షణ చికిత్స అందించి అనేక ప్రాణాలను కాపాడినట్లు తెలిపారు. ఇప్పటివరకు 20 మందికి పైగా మెదడు ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఆసుపత్రిలో 24 గంటల అత్యవసర, ట్రామా సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బాపట్ల జిల్లాలో తొలిసారిగా ఎమర్జెన్సీ ఫిజిషియన్, కార్డియాలజీ, న్యూరాలజీ నిపుణులను ఎప్పుడూ అందుబాటులో ఉంచిన ఆసుపత్రిగా శ్రీ గోరంట్ల హాస్పిటల్ నిలిచిందన్నారు.
కిడ్నీ రాళ్లు, హెర్నియా, గాల్బ్లాడర్, కడుపు సంబంధిత శస్త్రచికిత్సలు, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డయాలసిస్ వంటి సేవలు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక ఐసీయూ, సీటీ స్కాన్, క్యాథ్ల్యాబ్, శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బంది ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నారని చెప్పారు.
రానున్న రోజుల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డాక్టర్ రాజేష్ వెల్లడించారు. ప్రజలకు మానవీయతతో, బాధ్యతాయుతంగా వైద్య సేవలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ విలేకరుల సమావేశంలో హాస్పిటల్కు చెందిన పలు విభాగాల వైద్యులు పాల్గొన్నారు.










