
గుంటూరు: నవంబర్ 11:– రానున్న రోజుల్లో దేశంలో 10 కోట్ల మందిని “లాక్పతి దిదిలుగా” (లక్షపతి మహిళలుగా) తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెంలో మంగళవారం జరిగిన ‘వాటర్షెడ్ మహోత్సవ్’ జాతీయ సదస్సు రెండవ రోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, “ప్రతి కుటుంబం కనీసం లక్ష రూపాయల ఆదాయం పొందేలా చేయడం మా లక్ష్యం. ప్రస్తుతం రెండు–మూడు కోట్ల లాక్పతి దిదిలు ఉన్నారు. ఈ సంఖ్యను పదింతలు పెంచే దిశగా కృషి జరుగుతోంది” అని చెప్పారు.మంత్రివర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, “నేను రైతు సేవకుడిగా వచ్చాను. రైతు సేవే దైవ సేవ” అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి గల నేత, పవన్ కళ్యాణ్ దృష్టి, నరేంద్ర మోదీ ఆలోచనా విధానం కలిసి గొప్ప సమ్మేళనం సృష్టించాయని పేర్కొన్నారు. వెంగళాయపాలెం చెరువును దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ నమూనాగా తీసుకొని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి కుటుంబానికి పక్కా గృహం కల్పించాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. జిల్లాలో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు సమీక్షలు నిర్వహించి ఏ ఒక్కరు గుడిసెల్లో ఉండకుండా చూడాలని సూచించారు. మహిళా స్వావలంబన, మూడు పంటలు వేసుకునే విధానం, చిన్న సన్నకారు రైతుల అభివృద్ధి కోసం పలు చర్యలు చేపట్టినట్టు వివరించారు.కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, పల్లెలు దేశ ప్రగతికి పట్టుగొమ్మలని, 25 శాతం ప్రాంతాలు వర్షంపై ఆధారపడుతున్నాయని చెప్పారు. వాటర్షెడ్ ప్రాజెక్టుల ద్వారా నీటి వనరుల పెంపుతో రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కు 40 శాతం యూరియా సరఫరా జరిగిందని, ఉపాధి హామీ పెండింగ్ బిల్లులలో రూ.180 కోట్లు విడుదల చేశారని వెల్లడించారు.రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, నీటిని సద్వినియోగం చేసుకోకపోతే నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. భూగర్భజలాలు, భూసారం పరిరక్షణతో పాటు, సస్యశ్యామల ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అన్నారు.

కేంద్ర భూవనరుల కార్యదర్శి మనోజ్ జోషి మాట్లాడుతూ, దేశంలో తక్కువ ఫలసాయం ఇచ్చే 50 లక్షల హెక్టార్ల భూమిని పునరుద్ధరించి పంట ఉత్పాదకతను ఆరు రెట్లు పెంచినట్టు వివరించారు. దీంతో రూ.20 వేల కోట్ల అదనపు ఆదాయం, రైతు ఆదాయం 70 శాతం పెరుగుదల నమోదైందన్నారు.ఈ సందర్భంగా గ్రామీణ అభివృద్ధికి తోడ్పడిన వివిధ సంఘాలకు చెక్కులను అందజేశారు.కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ టి. క్రిస్టినా, ప్రధాన కార్యదర్శులు, కలెక్టర్లు, అధికారులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.










