
Eluru:కూచింపూడి:-ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ, ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ ముద్రించిన వాల్ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం కూచింపూడి గ్రామంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐఎఫ్టీయూ అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఎఫ్టీయూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ, కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోడులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతోందని, ఇవి పెట్టుబడిదారులకే అనుకూలంగా ఉన్నాయని విమర్శించారు. కార్మికులకు రక్షణ లేని ఈ లేబర్ కోడులకు వ్యతిరేకంగా ఈ నెల 12న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుందని తెలిపారు.
ఈ సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు అందరూ పాల్గొని సమ్మెను విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. అలాగే బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా యావత్ కార్మిక వర్గం సమ్మెలో పాల్గొవాలని కోరారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భవన ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును మరింత బలోపేతం చేయాలని, గతం నుంచి పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ మంజూరు చేయాలని, గతంతో పోలిస్తే క్లెయిమ్స్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. నిర్మాణ రంగ కార్మికులకు ఇచ్చిన హామీలను బేషరతుగా అమలు చేయాలని, సంక్షేమ బోర్డు నుంచి తీసుకున్న నిధులను తిరిగి జమ చేయాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని కోరారు. నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో కార్మికులు, కష్టజీవులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.Eluru Local News
ఈ వాల్ పోస్టర్ల కార్యక్రమంలో పెద్దిశెట్టి గంగరాజు, రామానుజయం రవి, గంగిరెడ్డి గంగాధర్ రావు, భూబత్తుల శ్రీను, అన్నవరపు శ్రీను, గంగిరెడ్డి శ్రీనివాసరావు, భూబత్తుల సత్తిబాబు, రామాంజనేయులు శివ, ఇనపనూరి వీర్రాజు, రామాంజనేయ రత్నాలు తదితరులు పాల్గొన్నారు.










